narkatpalli: అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఆత్మహత్యతో మహిళ మనస్తాపం.. ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది!

  • ఓ మహిళతో ఎదురింట్లో నివసించే వ్యక్తి అసభ్య ప్రవర్తన
  • అనంతరం సదరు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
  • ఈ విషయం తెలిసి ఉరేసుకున్న సదరు మహిళ
  • నార్కెట్ పల్లి మండలంలోని తొండ్లాయిలో ఘటన

తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపం చెందిన మహిళ, ఉరేసుకుని తన ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలంలోని తొండ్లాయిలో నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తొండ్లాయి గ్రామానికి చెందిన చింత మౌనిక (22)ను చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన లారీ డ్రైవర్ పొలిమెర స్వామికిచ్చి గతంలో వివాహం చేశారు.

ఈ నెల 27వ తేదీ రాత్రి మౌనిక తన పిల్లలతో కలిసి తన ఇంట్లో ఉండగా, ఎదురింట్లో నివసిస్తున్న దేశపాక ప్రసాద్ అనే వ్యక్తి ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం, అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిన ప్రసాద్ ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఈ సంఘటనతో మౌనిక చిట్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రసాద్ పై ఫిర్యాదు చేసింది. అదేరోజు రాత్రి తన పిల్లలతో కలిసి పుట్టిల్లయిన తొండ్లాయికి వెళ్లిపోయింది. అయితే, కాలినగాయాలతో చికిత్స పొందుతున్న ప్రసాద్ మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న మౌనిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మౌనిక తండ్రి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News