Karnataka: రూ. 500 అప్పు తీర్చలేదని... స్నేహితుడి భార్యను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు!

  • కర్ణాటక, బెళగావి జిల్లాలో ఘటన
  • స్నేహితుడికి రూ. 500 అప్పిచ్చిన రమేశ్
  • డబ్బు ఇవ్వడంలేదని ఫ్రెండ్ భార్య కిడ్నాప్, వివాహం
  • అడిగితే దాడులు చేయిస్తున్నాడన్న బసవరాజు

తానిచ్చిన రూ. 500ను తిరిగి ఇవ్వడం లేదన్న ఆగ్రహంతో తన స్నేహితుడి భార్యను తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటక, బెళగావి జిల్లా, మిడకనట్టిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2011లో బసవరాజు, పార్వతిలకు వివాహం కాగా, వీరికి ఓ కుమార్తె ఉంది. వీరిద్దరూ ఓ హోటల్ లో పనిచేస్తుండగా, మురుకిబావి గ్రామానికి చెందిన రమేష్ హుక్కేరి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో తనకు డబ్బు అవసరం కాగా, రమేశ్ వద్ద బసవరాజు రూ. 500 అప్పు తీసుకున్నాడు.

 ఈ అప్పు తిరిగి ఇవ్వడంలో బసవరాజు విఫలంకాగా, పలుమార్లు వాదనలు కూడా జరిగాయి. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, పార్వతిని ఎత్తుకెళ్లిన రమేశ్, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై అడిగితే, తనపై దాడులు చేస్తున్నాడని బసవరాజు ఆరోపిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, వారు కేసు నమోదు చేసుకోవడం లేదని ఆరోపించాడు. తన భార్యను కాపాడాలని బసవరాజు వేడుకున్నాడు.

  • Loading...

More Telugu News