Jana Sena: ఏపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లే వారి ప్రాణాలు పోయాయి: ‘జనసేన’

  • గూడలో అక్రమంగా క్వారీ వ్యవహారాలు
  • గూడ గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు
  • ‘జనసేన‘ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) 

అరకు నియోజకవర్గం పరిధిలో ఉన్న గూడ గ్రామంలో అక్రమంగా సాగుతున్న క్వారీ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ప్రాణాలు పోగొట్టుకొనేవారు కాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) అభిప్రాయపడింది. సర్వేశ్వర రావు, సోమల మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన సందర్భంలో గూడ గ్రామస్తుల విజ్ణప్తి మేరకు అక్కడికి వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా ప్యాక్ గుర్తు చేసింది. అక్కడి క్వారీ తవ్వకాల మూలంగా తాగునీటి వనరులు కలుషితమైన తీరుని అక్కడి గ్రామస్తులే పవన్ కల్యాణ్  కి చూపించిన విషయాన్ని, తమ ఇళ్ళు దెబ్బతింటున్న విషయాన్ని, తాముపడుతున్న ఇబ్బందులనీ తెలియజేయడాన్ని ప్యాక్ గుర్తు చేసింది.

అలాగే, కర్నూలు జిల్లా హత్తి బెళగల్ గ్రామంలోని క్వారీలో నిబంధనలకి విరుద్ధంగా ఉంచిన పేలుడు పదార్థాలు పేలి12 మంది కార్మికులు మృత్యువాతపడ్డారని, ఆ దుర్ఘటన ప్రదేశాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించి అక్రమ క్వారీలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని ప్యాక్ గుర్తుచేసింది.

గూడ గ్రామస్తులు తమ దగ్గర సాగుతున్న అక్రమ మైనింగ్ ను నిలుపుదల చేయాలని పలుమార్లు డిమాండ్ చేశారని, అధికారులకు విజ్ఞప్తులు ఇచ్చారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఈ ఉదాసీన వైఖరి వల్లే కిడారి సర్వేశ్వర రావు, శివేరి సోమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి అక్రమ మైనింగ్ వ్యవహారాలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్యాక్ డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News