Andhra Pradesh: పండుగ రోజున పెను విషాదం.. విద్యుత్ షాక్ తో ఇద్దరు పిల్లలు సహా తండ్రి మృతి!

  • గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దారుణం
  • టీవీకి డిష్ కేబుల్ బిగిస్తుండగా ఘటన
  • విచారణ జరుపుతున్న పోలీసులు

వినాయక చవితి పర్వదినం రోజున ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సోదరుడి గృహ ప్రవేశానికి వచ్చిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు తండ్రిని పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి వారు కూడా కన్నుమూశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాకు చెందిన చెందిన గుమ్మడి ఏసు (28), తన కుటుంబంతో కలిసి సోదరుడి గృహప్రవేశం కోసం ప్రత్తిపాడు మండలం గనికపూడి గ్రామానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం అన్న ఇంట్లోని టీవీకి డిష్ కేబుల్ ను బిగిస్తుండగా అందులో విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో ఏసు అక్కడిక్కడే చనిపోయాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న పిల్లలు సాల్మన్ రాజు (5), కుమార్తె ఎస్తేరు రాణి (4) పొరపాటున తండ్రిని పట్టుకోవడంతో వారికీ విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వారు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News