aligiri: పార్టీలో పట్టుకోసం కరుణానిధి తనయుడు అళగిరి మరో అస్త్రం!

  • త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి
  • తండ్రి మరణంతో ఖాళీ అయిన తిరువారూర్‌ నుంచి తానే పోటీ చేయాలన్న ఆలోచన
  • తనను పార్టీలో చేర్చుకోకుంటే పోటీ తప్పదని స్టాలిన్‌కు పరోక్ష సంకేతాలు

తండ్రి ఉన్నప్పుడే బహిష్కరణ వేటు పడి పార్టీలో ప్రాభవాన్ని కోల్పోయిన కరుణానిధి పెద్ద తనయుడు ఎం.కె.అళగిరి మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి మరణానంతరం తనను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తూ సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. ‘సమయం వచ్చినప్పుడు చెబుతా’ అంటూ తొలుత బింకానికి పోయినా.. తర్వాత స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్టు దిగి వచ్చాడు. స్టాలిన్‌ పెధ్దగా పట్టించుకోలేదు. ఈ నెల 5న చెన్నయ్ లో కరుణానిధి సమాధి వరకు భారీ ర్యాలీ నిర్వహించి సత్తాచాటినా సోదరుడు స్టాలిన్‌ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాజాగా మరో అస్త్రాన్ని సంధిస్తున్నట్లు సమాచారం.

తండ్రి మృతితో ఖాళీ అయిన తిరువారూర్‌, బోస్‌ మృతితో ఖాళీ అయిన తిరుప్పరకుండ్రం నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. తిరువారూర్‌ స్థానం నుంచి తానే రంగంలోకి దిగి సానుభూతి ఓట్లతో విజయం సాధించి సత్తా చాటాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తిరువారూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి తనకు ఉన్నట్లు సోదరి సెల్వి ద్వారా స్టాలిన్‌కు ఇప్పటికే అళగిరి వర్తమానం పంపారని, పార్టీలో చేర్చుకునేందుకే ఇష్టపడని స్టాలిన్‌ ఈ ప్రతిపాదనను తిరస్కరించారని సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన అళగిరి తాజా నిర్ణయాలతో దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News