Harikrishna: నటుడిగా, చైతన్యరథ సారధిగా, మంత్రిగా... హరికృష్ణ ప్రస్థానం!

- 1956లో ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించిన హరికృష్ణ
- పలు చిత్రాల్లో నటించి మెప్పించిన హరికృష్ణ
- నేడు రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హరికృష్ణ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1956 సెప్టెంబర్ 2న ఎన్టీఆర్, బసవతారకం దంపతుల 11 మంది సంతానంలో మూడోవాడిగా జన్మించారు. 1972లో ఆయనకు లక్ష్మితో వివాహం జరిపించగా, జానకి రామ్, సుహాసిని, కల్యాణ్ రామ్, తారక రామ్ (తల్లి షాలిని) జన్మించారు.


ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా హరికృష్ణ తన తండ్రిని అంటిపెట్టుకునే ఉన్నారు. ఆ తరువాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ, హరికృష్ణ ఏపీ మంత్రిగానూ కొంతకాలం సేవలందించారు. ఆపై టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణలో ఉద్యమం సాగుతున్న వేళ, దాన్ని వ్యతిరేకిస్తూ, 2013, ఆగస్టు 22న తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాడు సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తూ, రాష్ట్ర పర్యటన సైతం చేశారు.
ఆ తరువాత తన కుమారుడు జానకీరామ్ హఠాన్మరణంతో తీవ్ర మనో వేదనకు గురై, క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించి, తన కుటుంబానికి నందమూరి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చారు.