Hyderabad: మందుబాబులకు కొత్త కిక్.. జీహెచ్ఎంసీ పరిధి బార్లలో ఇక రాత్రి ఒంటి గంట వరకు మందేయొచ్చు!

  • బార్ల సమయాన్ని మరో గంట పెంచిన ప్రభుత్వం
  • రాత్రి ఒంటి గంట వరకు పొడిగింపు
  • శుక్ర, శనివారాలు మాత్రమే

బార్లలో మందు బాబులు గడిపే సమయాన్ని మరో గంట పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 12 గంటల వరకు మాత్రమే బార్లు తెరిచి ఉండగా, ఇకపై అదనంగా మరో గంట అంటే.. ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయన్నమాట. అయితే, ఇది కేవలం శుక్రవారం, శనివారం మాత్రమే. అది కూడా, జీహెచ్ఎంసీతోపాటు దాని పరిధిలోని ఐదు కిలోమీటర్లలో ఉన్న బార్లకే పరిమితం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో రాత్రి సమయాన్ని మరో గంట పెంచాలని బార్ల యజమానుల సంఘం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, శుక్ర, శనివారాలు మినహా మిగతా రోజుల్లో పాత సమయాలనే పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లను తెరిచిపెట్టుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News