devineni: సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు: మంత్రి దేవినేని

  • సబ్జెక్టు తెలియకుండా జగన్ మాట్లాడుతుంటారు
  • జగన్ కు కౌన్సెలింగ్ అవసరం
  • పులివెందులకు నీళ్లివ్వడాన్ని జగన్ చూడలేకపోతున్నారు

జలయజ్ఞం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న వైఎస్ జగన్ కు రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజక్టులపై మాట్లాడే నైతిక హక్కులేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సబ్జెక్టు తెలియకుండా జగన్ మాట్లాడుతుంటారని, ఆయనకు కౌన్సెలింగ్ అవసరమని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి 69వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణం పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశీలించారని, ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 56.90 శాతం, తవ్వకం పనులు 76.60 శాతం, కాంక్రీట్ పనులు 31.60 శాతం పూర్తయినట్టు అధికారులు చంద్రబాబు చెప్పారని అన్నారు.

కుడి ప్రధాన కాలువ 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ 62.41 శాతం పూర్తయిందని, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.67 శాతం, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93 శాతం పూర్తయ్యాయని దేవినేని చెప్పారు. గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు జరిగాయని, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 30 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టారని వెల్లడించారు. మొత్తం 56 ప్రాధాన్య ప్రాజెక్టులని మంత్రి దేవినేని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైనవి 9 కాగా, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి 6 ప్రాజెక్టులు అని, పనులు కొనసాగుతున్నవి 26 ప్రాజెక్టులని, కొత్తగా చేపట్టినవి 15 ప్రాజెక్టులని తెలిపారు.

ఆగస్టులో అడవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేయాలని, అలాగే సంగం-నెల్లూరు బ్యారేజ్‌లు నిర్దేశిత సమయానికి నిర్మించాలని, వాటి గడువు పెంచేందుకు వీలు లేదని చంద్రబాబు చెప్పారని, తారకరామ తీర్థ సాగర్ వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం కావాలని, వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మొదటిదశ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని అధికారులను బాబు ఆదేశించినట్టు తెలిపారు. ఆగస్టు 15 నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా వున్నట్టు చంద్రబాబుకు అధికారులు వివరించారని అన్నారు.

జగన్ అవినీతి కారణంగా ‘
పోలవరం’ పనుల్లో జాప్యం 

పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న 960 మెగా వాట్ల పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 2009 లో జగన్ ప్రయత్నించారని, దీనివల్లే 2009లో ఖరారు కావాల్సిన టెండర్లు 2013లో ఓకే అయినట్టు ఉమ చెప్పారు. జగన్ అవినీతి కారణంగా పోలవరం పనుల్లో జాప్యం చేసుకుందని, ఓట్లు దండుకోడానికి గ్రామాలలో కేవలం కాలువలు మాత్రమే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వించారని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా పులివెందులకు కూడా తాము నీరిచ్చామని, ఇది కూడా జగన్ చూడలేకపోతున్నారని, జగన్ కళ్లకు పురుషోత్తమపట్నం, ఏలేరు రిజర్వాయర్లలో నీళ్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కోర్టులో హాజరు కావడానికి, తన వ్యాపారాల లెక్కలు చూడడానికి హైదరాబాద్ వెళ్లడానికి సమయం ఉంటుంది గాని, పులివెందుల వెళ్లి తామిచ్చిన నీటిని చూడడానికి టైమ్ లేదా? అని జగన్ ని ప్రశ్నించారు.

జగన్ లెక్కలు తేలుస్తా..ఆయన నాటకాలు బయటపెడతా

నలభై ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి బిక్ష పెడుతున్న పులివెందులకు కృష్ణా జలాలు ఇవ్వడం జగన్ కు ఇష్టంలేదని, త్వరలోనే జగన్ కు పులివెందుల ప్రజలు ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తారని అన్నారు. జీతాలు తీసుకుంటూ, బడి ఎగ్గొట్టిన బడి పిల్లల మాదిరిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఊళ్లల్లో తిరుగుతున్నారని ఉమ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి జగన్, వైసీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, జగన్ లెక్కలు తేలుస్తానని, ఆయన నాటకాలు బయటపెడతానని దేవినేని హెచ్చరించారు. జగన్ తన తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని చేసిన దోపిడి కారణంగానే జైలుకెళ్లారని, ఒక మాజీ సీఎం కొడుకు 16 నెలలు జైల్లో ఉండడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకూ 65 వేల మంది రైతులు పోలవరం ప్రాజెక్టు సందర్శించారని, 80 ఏళ్ల వృద్ధుడు తనను కలిసి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాగుందని ప్రశంసించారని, ఆ వృద్ధుడు తనకు మరింత కాలం జీవించాలని ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.

కేవీపీ హుందాగా వ్యవహరించాలి

వయసు పెరిగితే సరిపోదని, హుందాగా నడుచుకోవడం నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీని ఉద్దేశించి ఉమ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసిన పాపాలన్నీ చేసేసి ఇప్పుడు లేఖలు రాస్తారా? అంటూ కేవీపీపై ఫైర్ అయ్యారు. బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్న జగన్ కు కేవీపీ ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీసిన టీడీపీ ఎంపీలను సన్మానిస్తే తప్పా? అని నిలదీశారు. బొత్స సత్యనారాయణ తీరు వల్లే నాడు రాష్ట్రానికి రావాల్సిన ఫోక్స్ వాగన్ సంస్థ రాకుండా పోయిందని విమర్శించారు. అనంతపురంలో ప్రారంభించిన కియా కంపెనీ కార్లు వచ్చే జనవరి నాటికి రోడ్లపై పరుగులు తీస్తాయని, అనంతపురం కియా కంపెనీ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోందని చెప్పారు.
 
అమరావతికి వచ్చిన తొలినాళ్లలో చెట్ల కింద బస్సులు నిలిపి పాలన సాగించామని, సీఎం చంద్రబాబునాయుడు పరిపాలనా దక్షత కారణంగా నేడు పెద్ద పెద్ద భవనాల్లో పాలన సాగిస్తున్నామని, అమరావతిలో విశాలమైన రోడ్ల నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. పోలవరం కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ.2,457 కోట్లు రావాల్సి ఉందని, ఇంతవరకూ రూ.6,724 కోట్లు ఇచ్చారని, దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టులా ఏ ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చుల వినియోగం ఆన్ లైన్లో పొందుపర్చలేదని అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఇంత వరకూ 69 వర్చువల్ సమావేశాలు, 20 పర్యాయాలు పనులను స్వయంగా పరిశీలించారని దేవినేని తెలిపారు. 

  • Loading...

More Telugu News