tspsc: టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎంపికైన 462 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు నియామక ఉత్తర్వులు

  • అందించిన మంత్రి తలసాని
  • గతంలో ఆదరణ లేని పశుసంవర్థక శాఖ
  • నేడు అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖగా గుర్తింపు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 462 మంది వెటర్నరీ అసిస్టెంట్ లకు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈరోజు నియామక ఉత్తర్వులను అందజేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేసిన సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.

'మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, మీ కృషి ఫలితంగానే నేడు ప్రభుత్వ ఉద్యోగం లభించింది' అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశు సంవర్థకశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు చేపట్టడం ఇదే మొదటిసారని తెలిపారు. గతంలో ఆదరణ లేని పశుసంవర్థక శాఖ నేడు అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖగా గుర్తింపును సాధించిందన్నారు.

ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో పెద్దఎత్తున అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టడమే కారణమని ఆయన అన్నారు. ప్రధానంగా 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో యాదవ, కురుమలకు గొర్రెల పంపిణీ విజయవంతంగా కొనసాగుతుందని వివరించారు. జీవాలకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 1962 టోల్ ఫ్రీ నెంబర్ తో నియోజకవర్గానికి ఒక సంచార పశువైద్యశాలను ప్రారంభించుకున్నామన్నారు.

అంతేకాకుండా వచ్చే వారంలో 890 కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీపై పాడిగేదెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పశు వైద్యశాలల అభివృద్ధికోసం 20 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. మూగ జీవాలకు సేవ చేసే అదృష్టం అందరికి లభించదని, అది ఈ ఉద్యోగాలు సాధించిన వారికి దక్కిందని  అన్నారు. పనిచేసే చోట మెరుగైన సేవలు అందించడం ద్వారా రైతుల మెప్పును పొందాలని మంత్రి ఆకాంక్షించారు.  

  • Loading...

More Telugu News