prakash raj: తమిళ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్

  • రాజకీయ నేతలు రియలెస్టేట్ వ్యాపారుల్లా మారిపోయారు
  • అయినకాడికి రాష్ట్రాన్ని అమ్మేసుకుంటున్నారు
  • రానున్న రోజుల్లో అన్నాడీఎంకే కనుమరుగవుతుంది

తమిళ రాజకీయాలు రియలెస్టేట్ వ్యాపారంలా మారాయని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న వారంతా రియలెస్టేట్ వ్యాపారుల్లా మారిపోయారని అన్నారు. తాను పార్టీతో పోరాడటం లేదని, ప్రభుత్వంతో పోరాడుతున్నానని చెప్పారు. రాజకీయ నాయకులు తమిళనాడును అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో నదులు, పొలాలు, అమాయకులైన ప్రజలు ఉన్నారు. రండి బాబూ రండి" అంటూ అయినకాడికి అమ్మేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే కాకుండా... అన్ని పార్టీలదీ ఇదే దారి అంటూ విమర్శించారు.

జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడం తప్ప... తమకు మరొక మార్గం లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే కానీ, కేంద్రంలో ప్రధాని మోదీ కానీ ప్రజల తరపున లేరంటూ దుయ్యబట్టారు. పార్టీలన్నింటికీ వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ప్రజాఉద్యమం వస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో అన్నాడీఎంకే కనుమరుగు కానుందని తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని... అయితే, ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడిగా మాత్రం కాదని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఏదీ మారిపోదని అన్నారు. సమాజానికి మంచి జరగాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ప్రశ్నించడం మానవహక్కు అని... దాన్ని ఎవరూ వదులుకోరాదని తెలిపారు.

  • Loading...

More Telugu News