dk aruna: మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే!: కేసీఆర్ పై మండిపడ్డ డీకే అరుణ

  • అవసరాన్ని బట్టి మాట్లాడటం కేసీఆర్ నైజం
  • ఎన్నికలు దగ్గర పడుతుండటంతో... గట్టు లిఫ్ట్ ఇప్పుడు గుర్తుకొచ్చింది
  • మహిళలను గౌరవించే సంస్కారం కూడా టీఆర్ఎస్ కు లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని... కాంగ్రెస్ హయాంలోనే జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు. టీఆర్ఎస్ మంత్రి అవినీతి వల్ల కల్వకుర్తి లిఫ్ట్ ఆగిపోయిందని విమర్శించారు. అవసరాన్ని బట్టి మాట్లాడటం కేసీఆర్ నైజమని దుయ్యబట్టారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయలేదని... ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, గట్టు లిఫ్ట్ గుర్తుకొచ్చిందని అన్నారు. ప్రాజెక్టు అంచనాలను పెంచి, టీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని విమర్శించారు. మహిళలను గౌరవించే సంస్కారం కూడా టీఆర్ఎస్ కు లేదని దుయ్యబట్టారు. మంత్రి హరీష్ రావు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News