Pawan Kalyan: వందల కోట్లు, వారసత్వం ఉన్నవాళ్లే రాజకీయాలు చేయాలా?: పవన్‌ కల్యాణ్‌

  • సామాన్యులు రాజకీయాల్లోకి రావాల్సిన తరుణం వచ్చింది
  • మధ్య తరగతివారు, మేధావులు రాజకీయాల్లోకి రావాలి
  • మన దగ్గర వేల కోట్లు లేవు
  • జనసేన పార్టీ ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ

వందల కోట్ల ఆస్తులు... కుటుంబ వారసత్వం ఉన్నవాళ్లు మాత్రమే రాజకీయాల్లోకి రావాలనే పద్ధతిని జనసేన పార్టీ మారుస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సామాన్యులు రాజకీయాల్లోకి రావాల్సిన తరుణం వచ్చిందని అన్నారు. మధ్య తరగతివారు, మేధావులు, సామాజిక స్పృహతో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని చెప్పారు.

ఈరోజు విశాఖపట్నంలో వివిధ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నేతలు, ప్రముఖులు తమ అనుచరులతో కలసి పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. వీరందరికి జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కార్మిక నేత బండారు సూర్య ప్రకాష్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి చిక్కాల ఉష శ్రీ, పారిశ్రామికవేత్త సి.బాలసతీష్, నాయకులు శ్రీమతి బండి సత్య రాధమ్మ, మైలా వీర్రాజు తదితరులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. "జనసేన పార్టీకి మీ అభిమానం, యువత తాలూకు బలం, ఆడపడుచుల ఆశీస్సులు చాలా ముఖ్యం. మనస్ఫూర్తిగా పార్టీలోకి రండి గాని, సీట్లు ఆశించి అయితే రాకండి అని నేను కొత్తవారితో చెప్పా. జనసేన పార్టీ ఎదిగే పార్టీ, ముందుకు వెళ్లే పార్టీ, దోపిడీని అరికట్టే పార్టీ.. అవినీతిపై పోరాటం చేసే పార్టీ. చాలా బలంగా వాదన వినిపించి పాలకులు, అధికార ప్రతిపక్ష నాయకులు ఎలా దోపిడీ చేస్తున్నారో చెప్పి, దాన్ని నిలువరించగలిగే స్థాయిలో ఆత్మస్థైర్యం ప్రతి ఒక్క జనసైనికుడికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఈ రోజున జనసేన పార్టీ లేకుండా వుండుంటే ప్రతి గ్రామంలోనూ రెండు గ్రూపులుగా విడిపోయి, ఒకసారి నువ్వు దోపిడీ చెయ్యి, తర్వాత నేను దోపిడీ చేస్తా అనేవారు. ఇద్దరు దోపిడీదారులను ఎదుర్కోవాలంటే జనసేన, జనసైన్యమే ఉండాలి. ఉద్యమం నడపడం కంటే రాజకీయ పార్టీని నడపడం కష్టం. మన దగ్గర వేల కోట్లు లేవు. జనసేన పార్టీ ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ. ఈ దేశంలో అన్ని పార్టీలకి అవకాశవాదమే తప్ప ఏ ఒక్కరికీ ప్రజా సమస్యలపై స్పష్టత లేదు. ఏ ఒక్కరు కూడా మన రాష్ట్రానికి నిధులు లేవు, ప్రాజెక్టులు లేవు... ఇవ్వండి అని అడగటం లేదు. ఏదయినా అంటే మా హైకమాండ్ చెప్పిందే మాకు శిరోధార్యం అంటారు.

విశాఖ చుట్టుపక్కల లక్ష ఎకరాల భూములు దోచేశారు. దీనిపై వేసిన సిట్ ఇచ్చిన నివేదిక ఏమైంది? ముఖ్యమంత్రికి చేరితే ఎందుకు దాన్ని గుండెల్లో పెట్టి దాచుకొంటున్నారు? ఆ అవినీతిలో భాగం ఉందా? మాట్లాడితే మేమెక్కడ అవినీతి చేసాం అంటారు.. మరి అవినీతిలో భాగం లేకపోతే సిట్ నివేదిక బయటపెట్టండి" అన్నారు.

  • Loading...

More Telugu News