Hyderabad: చార్మినార్‌ను సంద‌ర్శించిన కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి ఏ.ఎన్‌.ఝా

  • చార్మినార్ పెడెస్టేరియ‌న్ ప్రాజెక్ట్ ప‌నుల పురోగ‌తిపై పరిశీలన
  •  ఈ ప్రాజెక్ట్ ప‌నుల‌ను వివరించిన జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ 
  • అభివృద్ధి ప‌నుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన ఝా

హైదరాబాద్ లోని చారిత్రక కట్టడం చార్మినార్, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో చేప‌ట్టిన చార్మినార్ పెడెస్టేరియ‌న్ ప్రాజెక్ట్ ప‌నుల పురోగ‌తిని కేంద్ర ప్ర‌భుత్వ ఆర్థిక వ్య‌య శాఖ కార్య‌ద‌ర్శి ఏ.ఎన్‌.ఝా ఈరోజు ప‌రిశీలించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జనార్ద‌న్‌రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌, సీసీపీ డైరెక్ట‌ర్ ముషార‌ఫ్ అలీలు కేంద్ర కార్య‌ద‌ర్శితో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ ద్వారా చేప‌ట్టిన చార్మినార్ పెడెస్టేరియ‌న్ ప్రాజెక్ట్ ప‌నుల‌ను ఝాకు వివ‌రించారు. ముఖ్యంగా రూ.3.86 కోట్ల వ్య‌యంతో చార్మినార్ చుట్టూ నిర్మించిన గ్రానైట్ పేవ్‌మెంట్ ప‌నులు, కోటి రూపాయ‌ల వ్య‌యంతో మ‌హ‌బూబ్ చౌక్‌, క్లాక్‌ట‌వ‌ర్ల పున‌ర్ నిర్మాణం, కోటి 77ల‌క్ష‌ల రూపాయ‌ల వ్య‌యంతో చార్ క‌మాన్‌ల అభివృద్ది, రూ.43.72 ల‌క్ష‌ల వ్య‌యంతో అండ‌ర్ గ్రౌండ్ డ‌క్ట్‌ ల నిర్మాణం త‌దిత‌ర ప‌నుల‌ను చేప‌ట్టిన‌ట్టు జనార్ద‌న్‌రెడ్డి వివ‌రించారు.

చార్మినార్‌తో పాటు స‌మీపంలోని మ‌రో చారిత్ర‌క ప్రాధాన్య‌త క‌లిగిన మొజం జాహి మార్కెట్‌ను కూడా పూర్తి స్థాయిలో పున‌రుద్ధరిస్తున్న‌ట్టు వివ‌రించారు. కాగా, నాలుగు శ‌తాబ్దాల‌కు పైగా చ‌రిత్ర కలిగిన మ‌క్కా మ‌సీద్‌, యునాని ఆసుప‌త్రి భ‌వ‌న స‌ముదాయాల‌ను చార్మినార్ పై నుండి ప‌రిశీలించిన ఝా సంతోషం వ్య‌క్తం చేశారు. చార్మినార్‌, ప‌రిస‌ర ప్రాంతాల్లో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News