N.Kiran kumar Reddy: కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే తీర్థం!

  • కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడిన రాహుల్
  • త్వరలోనే పార్టీలో చేరిక
  • కాంగ్రెస్‌కు పునర్వైభవం కోసం కృషి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను ముఖ్యమంత్రిని కావడానికి కారణమైన కాంగ్రెస్ ప్రస్తుతం ఏపీలో కష్టాల్లో ఉన్నందున స్వచ్ఛందంగా సేవలు అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకు వచ్చేందుకు శాయశక్తులా కృషి చేయాలని యోచిస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో విలేకరులతో మాట్లాడుతూ.. విభజన వల్ల కాంగ్రెస్ ఇరు రాష్ట్రాల్లోనూ దారుణంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఆయన అన్నట్టే జరిగింది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో కాంగ్రెస్‌కు పునర్వైభవం కోసం తపిస్తున్న ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పటికే కిరణ్‌ కుమార్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తోంది. చీటికిమాటికి అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ప్రతిపక్ష వైసీపీని కూడా టార్గెట్ చేసుకుంటేనే కాంగ్రెస్‌కు లాభం ఉంటుందని ఈ సందర్భంగా కిరణ్ సూచించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన కిరణ్ కుమార్ రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని స్థాపించారు.

  • Loading...

More Telugu News