BJP: బీజేపీ నేతతో హోటల్‌కి వెళ్లి భోజనం చేశాను.. అంతే!: వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన

  • ఆకుల సత్యనారాయణ నాకు ఓ మంచి ఫ్రెండ్‌
  • ఇంత చిన్న విషయాన్నే టీడీపీ వక్రీకరిస్తోంది
  • టీడీపీ ఇంతగా ఎందుకు ఉలిక్కిపడుతోంది
  • లోకేశ్‌ ట్వీట్‌ హాస్యాస్పదంగా ఉంది

నిన్న ఢిల్లీలో బీజేపీ నేతలతో తాను భేటీ అయి పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు వస్తోన్న ఆరోపణలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఖండించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను నిన్న ఢిల్లీలో ఏపీ భవన్‌లో ఉన్నానని, తాను రహస్యంగా ఎవ్వరినీ కలవలేదని అన్నారు. బీజేపీ నేత ఆకుల సత్యనారాయణతో అటువంటి విషయాలు చర్చించాలంటే ఢిల్లీకి ఎందుకు వెళతానని, ఆంధ్రప్రదేశ్‌లోనే చర్చించే అవకాశం ఉంది కదా? అని వ్యాఖ్యానించారు.

ఆకుల సత్యనారాయణ తనకు ఓ మంచి ఫ్రెండ్‌ అని, మధ్యాహ్నం హోటల్‌కి లంచ్‌కి వెళ్లామని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. ఇంత చిన్న విషయాన్నే టీడీపీ వక్రీకరిస్తోందని అన్నారు. టీడీపీ ఇంతగా ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ బోర్డులో బీజేపీ నేత భార్యను నియమించారని, వారు మాత్రం బీజేపీతో ఎలాగైనా ముందుకు వెళ్లొచ్చు కానీ, వేరే వారు మాత్రం మాట్లాడకూడదా? అని నిలదీశారు.

నిన్న ఏపీ మంత్రి లోకేశ్‌ చేసిన ట్వీట్‌ హాస్యాస్పదంగా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. హోటల్‌లోకి వెళ్లి భోజనం చేస్తే కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో లోకేశ్‌పై కూడా ఎన్నో ఫొటోలు వచ్చాయని మరి వాటి గురించి ఏమంటారని ప్రశ్నించారు. టీడీపీ విప్‌ కూన రవికుమార్‌ను కూడా తాను ఏపీ భవన్‌లో కలిశానని, ఆయన తనను ఆలింగనం కూడా చేసుకున్నారని, మరి ఆ విజువల్స్‌ ఎందుకు చూపించడం లేదని అన్నారు. టీడీపీ విప్‌ తనను కౌగిలించుకుంటే ఆయన వైసీపీలో చేరుతున్నట్లా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News