Odisha: వివాహేతర సంబంధం ఆరోపణ.. మహిళ కురులు కత్తిరించి.. వివస్త్రను చేసిన వైనం!

  • ఒడిశాలో దారుణ ఘటన
  • గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసిందని కక్ష
  • ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు

వివాహేతర సంబంధాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై ఓ మహిళ కురులు కత్తిరించి, వివస్త్రను చేసిన అమానుష ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలంగీర్ జిల్లా లొహసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరెకొచియా గ్రామానికి చెందిన ఓ వివాహిత గ్రామంలో అక్రమ సంబంధాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన కొందరు ఆమెపై దాడిచేసి దుర్భాషలాడారు. దీంతో ఆమె గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పెద్దలు దుర్భాషలాడిన వ్యక్తులను మందలించి విడిచిపెట్టారు.

అయితే, తమపై ఫిర్యాదు చేసినందుకు అవమానంగా భావించిన వ్యక్తులు వివాహితపై కక్ష పెంచుకున్నారు. ఒంటరిగా వెళ్తున్న ఆమెపై అందరూ కలిసి దాడిచేసి నిర్బంధించారు. అనంతరం ఆమె కురులు కత్తిరించి వివస్త్రను చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజులు గడుస్తున్నా పోలీసులు స్పందించకపోవడంతో సోమవారం ఆమె విలేకరుల ఎదుట తనకు జరిగిన అవమానం గురించి చెబుతూ విలపించింది. దీంతో స్పందించిన పోలీసులు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News