prattipati: వచ్చే నెల నుంచి రేషన్‌ షాపుల్లో 2 కేజీల కందిపప్పు: ఏపీ మంత్రి ప్రత్తిపాటి

  • అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం
  • తక్షణమే డీలర్ల పోస్టుల భర్తీ 
  • నిర్దేశించిన సమయాల్లో సరుకుల పంపిణీ
  • చంద్రన్న విలేజ్‌ మాల్స్ ను ప్రారంభించడానికి చర్యలు

వచ్చే నెల నుంచి రేషన్‌ కార్డుదారులకు కందిపప్పు రెండు కేజీల చొప్పున పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలోని తన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

రేషన్ డీలర్ల కోరిక ప్రకారం తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నియమించే అవకాశాలపై ప్రత్తిపాటి చర్చించారు. డిపోల ద్వారా సక్రమంగా నిర్దేశించిన సమయాల్లో సరుకుల పంపిణీకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రేషన్ షాపు డీలర్ల కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులను నామినీగా నియమించుకునే వెసులుబాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

చంద్రన్న విలేజ్‌ మాల్స్ విషయంలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు త్వరితగతిగా విలేజ్ మాల్స్ ను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రన్న విలేజ్ మాల్స్ లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులను అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చే నెల నుంచి కార్డుదారులందరికీ రెండు కేజీల కందిపప్పు అందించాలన్నారు.

వేలి ముద్రలు పడని వారికి అత్యంత సులభతరమైన పద్ధతి ద్వారా రేషన్ అందించేందుకు అనువైన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, ఎండీ సూర్యకూమారి, డైరెక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News