Chandrababu: ఏపీకి రైల్వేజోన్ తేలేని అసమర్థుడు చంద్రబాబు: బొత్స తీవ్ర వ్యాఖ్యలు

  • నాలుగేళ్లలో చంద్రబాబు సాధించింది అవినీతి తప్ప ఏమీ లేదు
  • ఏపీలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారు
  • అవినీతి విషయంలో బీహార్ ను ఏపీ మించిపోయింది

ఏపీకి రైల్వేజోన్ తేలేని అసమర్థుడు చంద్రబాబు అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాలుగేళ్లలో చంద్రబాబు సాధించింది అవినీతి తప్ప ఏమీ లేదని, ఏపీలో పాలనను చంద్రబాబు గాలికి వదిలేసి, ప్రతిపక్షంపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, అవినీతిని ప్రశ్నిస్తున్న పవన్ కల్యాణ్, రమణదీక్షితులపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.

అవినీతి విషయంలో బీహార్ ను ఏపీ మించిపోయిందని, ఏపీలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మట్టి, ఇసుక, మద్యం, మాఫియాను రాష్ట్రంలో పెంచి పోషిస్తున్నారని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. ఎయిర్ ఏసియా కుంభకోణం విషయమై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరగలరా? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తమతో వచ్చే పార్టీలతో కలిసి పోరాడతామని, హోదా సాధన కోసం తమ ఎంపీలు చిత్తశుద్ధితో రాజీనామాలు చేశారని అన్నారు.   

  • Loading...

More Telugu News