Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ అదృశ్యం.. సంచలనంగా మారిన మిస్సింగ్!

  • జైపూర్ నుంచి శంషాబాద్ చేరుకున్న వివాహిత
  • క్యాబ్ ఎక్కిన తర్వాత సోదరుడికి ఫోన్
  • అక్కడే ఉన్నామని చెప్పిన సోదరుడు.. ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్
  • ఖమ్మంకు చెందిన మోహన్‌రావుపై భర్త అనుమానం

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి ఓ మహిళ అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. సాయిప్రసన్నను గురువారం రాత్రి తన భర్త జైపూర్‌లో హైదరాబాద్ విమానం ఎక్కించారు. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సాయిప్రసన్న తండ్రి, సోదరుడు ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు.

ఈ విషయం తెలియని సాయిప్రసన్న తండ్రి, సోదరుడికి తెలియకుండా క్యాబ్ మాట్లాడుకుని విమానాశ్రయం నుంచి వెళ్లిపోయింది. క్యాబ్ ఎక్కిన తర్వాత సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో తాము విమానాశ్రయంలోనే ఉన్నామని, క్యాబ్ దిగాలని చెప్పాడు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అయింది. మరోమారు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ ఆఫ్ చేసి ఉండడంతో తండ్రి, సోదరుడు ఆందోళన చెందారు.

వెంటనే ఈ విషయాన్నిఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పారు. ఖమ్మంకు చెందిన మోహన్‌రావు అనే వ్యక్తిపై అతను అనుమానం వ్యక్తం చేశాడు. కాగా, కుమార్తె అదృశ్యంపై సాయిప్రసన్న తండ్రి ఆర్జీఐఏలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కీలకంగా మారిన ఎయిర్‌పోర్టులోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించాలని పోలీసులు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News