Amit sha: తిరుమలకు వచ్చిన అమిత్ షాకు అడుగడుగునా చుక్కెదురు!

  • తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
  • అలిపిరి వద్దే నిరసన తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలు
  • వారికి జత కలిసిన శ్రీవారి భక్తులు
  • తిరుమలలోనూ హోదా నినాదాలు

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం ఈ ఉదయం వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రత్యేక హోదా సెగ తగిలింది. ఆయనకు అడుగడుగునా చుక్కెదురైంది. ప్రజలతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఆయన రాకను నిరసిస్తూ నినాదాలు చేశారు. అమిత్ షా వస్తున్నారన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న తిరుపతి వాసులు, అలిపిరి వద్దకు చేరుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

 రాష్ట్రానికి అన్యాయం చేసిన అమిత్ షా తిరుమలకు రావడం ఏంటని అడిగారు. ఇదే వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను మరచిపోయారని నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ నిరసన చేపట్టగా, కాలినడకన తిరుమలకు బయలుదేరిన పలువురు యాత్రికులు కూడా వారితో జతకలిశారు. నిరసనను ముందుగానే పసిగట్టిన పోలీసులు, భారీ ఎత్తున అలిపిరిలో మోహరించి నిరసనకారులను అడ్డుకున్నారు.

అక్కడి నుంచి అమిత్ షా తిరుమలకు చేరుకోగా, అక్కడా భక్తుల నుంచి నినాదాల స్వాగతం కనిపించింది. అమిత్ షా కాన్వాయ్ వెళుతుంటే, రహదారి పక్కన ఉన్న భక్తులు హోదా కోసం నినాదాలు చేశారు. అమిత్ షాకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, ప్రొటోకాల్ ప్రకారం దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.

  • Loading...

More Telugu News