Andhra Pradesh: నిజంగా ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు చేయాలి!: ఏపీ మంత్రి మండలి ఉపసంఘం

  • ఏపీ మంత్రి మండలి ఉపసంఘం సమావేశం
  • గత ప్రభుత్వంలో లబ్దిదారులకు తెలియకుండా వారి పేర్లపై ఇళ్లు
  • అటువంటి దరఖాస్తులను పరిశీలించండి
  • నిజంగా ఇళ్లు లేకపోతే.. పాత రికార్డులలో వారి పేర్లు తొలగించాలి

అధికారుల పరిశీలనలో వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు మంజూరు చేయాలని  ఏపీ మంత్రి మండలి ఉపసంఘం సమావేశం నిర్ణయించింది. సచివాలయం 2వ బ్లాక్ లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పి.నారాయణ, కింజరాపు అచ్చన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి పాల్గొన్నారు.

గత ప్రభుత్వంలో లబ్దిదారులకు తెలియకుండా వారి పేర్లపై ఇళ్లు మంజూరు చేసిన అంశం చర్చకు వచ్చింది. వాళ్లు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే వారి పేర్లపై ఇళ్లు మంజూరైనట్లు రికార్డులలో నమోదు కావడంతో ఇళ్లు మంజూరు చేయడం కుదరడం లేదని అధికారులు తెలిపారు. అటువంటి దరఖాస్తులను పరిశీలించి, అధికారులు స్వయంగా వెళ్లి తనిఖీ చేసి, వారికి నిజంగా ఇళ్లు లేకపోతే, పాత రికార్డులలో వారి పేర్లు తొలగించి, కొత్తగా ఇల్లు మంజూరు చేయమని ఉపసంఘం ఆదేశించింది. 2004కు ముందు ఎస్టీలకు రూ.7500 తో నిర్మించిన  పూరిళ్లు, షెడ్లు పూర్తిగా దెబ్బతినడంతో వారికి కూడా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. గృహ నిర్మాణ నిధులకు కొరతలేదని, నిర్మాణ వేగం పెంచాలని మంత్రి యనమల ఆదేశించారు. కొన్ని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కావాలని అధికారులు కోరగా మంజూరు చేస్తామని యనమల చెప్పారు. అన్ని ప్రాంతాలల్లో గృహ నిర్మాణ వ్యయం ఒకే రకంగా ఉండాలని, మెటీరియల్, ఇతర అదనపు సౌకర్యాలకు అదనంగా అయ్యే ఖర్చుని లబ్దిదారుడు భరాయించడానికి సిద్ధంగా ఉంటే అందుకు అనుమతించాలని అన్నారు. నిర్మాణం పూర్తి అయి, మౌలిక వసతులు లేక స్వాధీనం చేసుకోని ఇళ్లకు మౌలిక వసతులు సమకూర్చాలని నిర్ణయించారు.
 
ఇళ్ల నిర్మాణ వ్యయం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం (నరేగా) కింద 90 రోజుల పని దినాలు, గ్రూప్ ఇళ్లు, మెటీరియల్, పట్టణ, గ్రామీణ ఇళ్ల నిర్మాణం, అపార్ట్ మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు, అగనంపూడి, రాజంపేటలలో ఇళ్ల నిర్మాణం, కడప శాటిలైట్ టౌన్ షిప్, పీఎంఏవై ఇళ్ల నిర్మాణం, హడ్కో రుణం, వడ్డీ శాతం వంటి పలు అంశాలపై చర్చించారు. 

  • Loading...

More Telugu News