Prakash Raj: బీజేపీపై ద్వేషం అందుకే.. నా సొంత ఖర్చుతోనే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం: ప్రకాశ్ రాజ్

  • నా ప్రచారంలో హంగు, ఆర్భాటాలు ఉండవు
  • ప్రజల్లో ఆలోచనా శక్తి పెరిగే కొద్దీ బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది
  • మోదీ నుంచి దేశాన్ని కాపాడేందుకు నాలాంటి చౌకీదార్లు పుట్టుకొస్తున్నారు

బీజేపీకి వ్యతిరేకంగా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ ప్రచారం చేస్తున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. బీజేపీపై తాను పెంచుకున్న ద్వేషానికి కారణాన్ని బయటపెట్టారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. తాను హిందూ వ్యతిరేకిని కానని పేర్కొన్న ప్రకాశ్ రాజ్, బీజేపీ తీరుతో హిందూయిజం ప్రమాదంలో పడిందన్నారు. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ఒక కులం, ఒక మతం మాత్రమే దేశాన్ని ఏలాలనే సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు.

తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని, సొంత ఖర్చుతోనే బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నానని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. తన ప్రచారంలో హంగూ, ఆర్భాటాలు ఉండవన్నారు. తాను పనిచేసే ప్రతి చోట ప్రజల్లో ఆలోచన రేకెత్తించానని పేర్కొన్నారు. అందరూ తప్పకుండా ఓటేయాలని కోరానని, అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. కర్ణాటకలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించినట్టు చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తానని, మోదీ నుంచి దేశాన్ని కాపాడేందుకు తనలాంటి చౌకీదార్లు ఎందరెందరో ముందుకు వస్తున్నారని ప్రకాశ్ రాజ్ వివరించారు. ప్రజల్లో ఆలోచనా శక్తి పెరిగే కొద్దీ బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని పేర్కొన్న ఆయన ప్రజలు ఎల్లప్పుడూ ప్రతిపక్షాలుగా ఉంటే ప్రభుత్వాలు వారి కోసం పనిచేస్తాయని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News