kalva: ఏడాదిలో 3 లక్షల ఇళ్లు నిర్మించాం, రికార్డు స్థాయిలో ఇళ్లకు వ్యయం: ఏపీ మంత్రి కాల‌్వ శ్రీ‌నివాసులు

  • ప్రతి పేద‌వాడికి ప‌క్కా ఇల్లు ఉండాల‌న్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
  • రాష్ట్రంలో శ‌ర‌వేగంగా గ్రామీణ‌ గృహ‌ నిర్మాణాలు
  • 2019 నాటికి రాష్ట్రంలో 10 ల‌క్షల ఇళ్లు
  • ఏడాదిలో 5,51,035 ఇళ్ల నిర్మాణాల‌కు అనుమ‌తులు

గ్రామీణ ప్రాంతాల్లో గృహ‌నిర్మాణ ప్రగ‌తిపై రూపొందించిన ప్రత్యేక సంచిక‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆవిష్కరించారు. అమరావతిలోని ఉండ‌వ‌ల్లి గ్రీవెన్స్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామీణ గృహనిర్మాణ శాఖ‌మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు, హౌసింగ్ ఎండీ కాంతిలాల్ దండే, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని గృహ‌నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 10 లక్షల ఇళ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి వచ్చే ఏడాదికి 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ప్రారంభించేందుకు జూన్ నెల నుండి ప్రతి నెలా రాష్ట్రంలో సామూహిక గృహ‌ ప్రవేశాలు నిర్వహించాలన్నారు. అర్హుడైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు వుండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గ్రామీణ గృహ‌ నిర్మాణశాఖ‌ ఏడాది కాలంలో సాధించిన ప్రగ‌తిని మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు ఒక ప్రకట‌న రూపంలో తెలియ‌జేశారు. రాష్ట్రంలో గ‌డచిన ఆర్థిక సంవ‌త్సరం (2017-18)లో రూ.3787 కోట్ల ఖ‌ర్చుతో నిరుపేద‌ల‌కు ప‌క్కా ఇళ్ల నిర్మాణాన్ని చేప‌ట్టామని, రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ చ‌రిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డని కాల్వ శ్రీ‌నివాసులు పేర్కొన్నారు. ఒక సంవ‌త్సర కాలంలో మూడు ల‌క్షల పైచిలుకు ఇళ్లు పూర్తిచేసిన ఘ‌న‌త ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానిదేన‌ని మంత్రి తెలిపారు.

2019 నాటికి రాష్ట్రంలో 10 ల‌క్షల ఇళ్లు నిర్మించాల‌న్నదే ప్రభుత్వ లక్ష్యమ‌ని మంత్రి చెప్పారు. 2022 నాటికి రాష్ట్రంలో అర్హులైన వారంద‌రికీ ప‌క్కా ఇళ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దీనిలో భాగంగా 2018-19 సంవ‌త్సరానికి గృహ‌నిర్మాణ‌శాఖ బ‌డ్జెట్‌ను భారీగా పెంచ‌డంతో పాటు సుమారు రూ.10 వేల కోట్ల నిధుల‌ను అందుబాటులో ఉంచ‌డం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేద‌ల ప‌క్షాన ఉంద‌ని మ‌రోసారి రుజువైంద‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్న సాయానికి అద‌నంగా రాష్ట్రం ఎక్కువ మొత్తాన్ని వివిధ ఆర్థిక సంస్ధల ద్వారా నిధులు స‌మ‌కూర్చుకుంటూ గృహ‌నిర్మాణ సంస్థ ద్వారా ప‌క్కా ఇళ్ల నిర్మాణం చేప‌డుతోంద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ నిబంధ‌న‌ల్లో చేప‌ట్టిన మార్పుల కార‌ణంగా గ‌త ఏడాది కాలంగా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగ‌వంత‌మ‌యింద‌న్నారు. 2017-18 ఆర్థిక సంవ‌త్సరంలో ప్రభుత్వం తీసుకున్న ప‌లు నిర్ణయాలు ఇందుకు దోహ‌దం చేశాయని మంత్రి కాల్వ తెలిపారు.

ఇళ్ల నిర్మాణాలు వేగ‌వంతమ‌య్యేందుకు తీసుకున్న నిర్ణయాలు:


* గ‌తంలో ఇంటి నిర్మాణానికి 550 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం వ‌ర‌కు మాత్రమే అనుమ‌తి ఉండ‌గా, ప్రస్తుతం దీనిని 750 అడుగుల వ‌ర‌కు పెంచారు.
* గ్రామాల్లో ఒకే కుటుంబంలో అన్నద‌మ్ములు, తండ్రీకొడుకులు ప‌క్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్నట్లయితే వారు ఒకే గోడ‌ను ఆనుకొని వేర్వేరు ఇళ్లు నిర్మించుకునేలా నిబంధ‌న‌లు స‌డ‌లించారు
* గ‌తంలో మంజూరై అసంపూర్తిగా మిగిలిన ప‌క్కా ఇళ్ల నిర్మాణాల‌కు అద‌న‌పు స‌బ్సిడీగా రూ.25 వేలు మంజూరు చేశారు
* ఏడాదిలో 5,51,035 ఇళ్ల నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇచ్చారు
* ఒకే సంవ‌త్సరంలో రూ.3,787 కోట్లతో 3.15 లక్షల ఇళ్ల నిర్మాణాలు
* ఒకేసారి ల‌క్ష ఇళ్లలో గృహప్రవేశాలు
* సామూహిక శంకుస్థాప‌న కార్యక్రమాలు
* మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌కు రూ.100 కోట్లు
* పార‌దర్శకంగా బిల్లుల చెల్లింపు
* పేద‌ల‌కు బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు
* అధికారుల‌తో ఎప్పటిక‌ప్పుడు స‌మావేశాలు, క్షేత్రస్థాయిలో త‌నిఖీలు

  • Loading...

More Telugu News