BJP: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పాక్ కుట్ర... సాక్ష్యం చూపిన బీజేపీ!

  • టిప్పు సుల్తాన్ ను పొగడిన పాకిస్థాన్
  • అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు
  • కాంగ్రెస్ ను గెలిపించాలని కుట్రే
  • ముస్లిం ఓట్ల కోసమేనన్న బీజేపీ

కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూసి, కాంగ్రెస్ తిరిగి గెలిచేలా చేయాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, ఇందుకోసం స్వయంగా రంగంలోకి దిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి సాక్ష్యంగా టిప్పు సుల్తాన్ 218వ వర్థంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం, తన అధికార ట్విట్టర్ ఖాతాలో పెట్టిన రెండు పోస్టులను బీజేపీ సాక్ష్యంగా చూపుతోంది.

కాంగ్రెస్ కోరిక మేరకే పాక్ కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కర్ణాటకలోని ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసేందుకు పాక్ నడుం బిగించి ఈ ట్వీట్లు పెట్టిందని పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. 1947 తరువాతనే తమ చరిత్ర మొదలైనట్టు చెప్పుకునే పాక్, ఉన్నపళంగా టిప్పు సుల్తాన్ పై ఇంత ప్రేమ కురిపించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చారిత్రక వారసత్వాన్ని ఎన్నడూ పట్టించుకోని, ప్రస్తావించని పాక్ ఇప్పుడిలా చేయడం వెనుక కుట్ర దాగుందని అన్నారు.

కాగా, పాక్ ప్రభుత్వం తన ట్వీట్లలో టిప్పును ఆకాశానికి ఎత్తేసింది. ఆయన అంతులేని జ్ఞాన సంపద ఉన్న వ్యక్తని, పులినే తన అధికార చిహ్నంగా చేసుకున్న ధైర్యశాలని పొగిడింది. బ్రిటీష్‌ సైన్యం ఎదుర్కొన్న అతి గొప్ప శత్రు సారధుల్లో టిప్పు సుల్తాన్ ఒకరని, ఫ్రెంచ్‌ వారు అడిగితే, ఓ చర్చి నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారని గుర్తు చేసింది. బ్రిటీష్‌ సామ్రాజ్య విస్తరణను అడ్డుకునేందుకు సంధించబడ్డ చివరి బాణం టిప్పు సుల్తాన్ అంటూ ప్రశంసలు గుప్పించింది.

  • Loading...

More Telugu News