Karnataka: పెళ్లి పందిట్లో నవ వధువుపై ప్రేమికుడి దాడి.. ప్రాణాలతో పోరాడుతున్న నవ వధువు

  • తాను ప్రేమించిన యువతికి వేరే యువకుడితో పెళ్లి
  • జీర్ణించుకోలేకపోయిన ప్రేమికుడు
  • పెళ్లి పందిట్లో అందరూ చూస్తుండగానే దాడి
  • కర్ణాటకలోని శివమొగ్గలో ఘటన

పెళ్లి జరుగుతుండగా పందిట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు పెళ్లి కుమార్తెను విచక్షణ రహితంగా పొడిచిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన వధువు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం..  ఆర్టీవో బ్రోకర్‌గా పనిచేస్తున్న నందన్ అనే యువకుడు గత ఆరు నెలలుగా యువతిని ప్రేమిస్తున్నట్టు చెబుతూ వెంటపడుతున్నాడు. దీనికి ఆమె నిరాకరించింది.

ఇంతలోనే యువతి కుటుంబ సభ్యులు సాగర్‌ తాలూకా భీమనకోనే కప్పమనెలోని భరత్ అనే యువకుడితో ఆమెకు పెళ్లి కుదిర్చారు. సోమవారం వరుడి ఇంటి వద్ద ఘనంగా పెళ్లి జరుగుతోంది. విషయం తెలిసిన నందన్ తాను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి అవుతుండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.

గ్రామానికి చేరుకుని పెళ్లి పందిట్లోకి ప్రవేశించి ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్న వధువుపై కత్తితో దాడి చేశాడు. ఆమె పొట్టలో విచక్షణ రహితంగా పొడిచాడు. అడ్డొచ్చిన వధువు బాబాయి గంగాధరప్పపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వధువు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. పెళ్లి కొచ్చిన వారు నందన్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News