Karnool: కర్నూలు జిల్లాలో పరువు హత్య కలకలం... ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు

  • వరసకు బావయ్యే నాగేంద్రను ప్రేమించిన లక్ష్మి
  • నాగేంద్రపై సదభిప్రాయం లేని లక్ష్మి తండ్రి
  • పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట
  • గొంతు నులిమి చంపిన తల్లిదండ్రులు

ప్రేమ పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో కన్న బిడ్డను చేజేతులా కడతేర్చారో తల్లిదండ్రులు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో ఈ దారుణం జరిగింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందన్న కోపంతో ఆమెను గొంతు నులిమి చంపారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, నరసయ్య కుటుంబం కోటకందుకూరులో ఉంటోంది. ఆయన కుమార్తె లక్ష్మి (17), తనకు వరసయ్యే నాగేంద్ర అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఊర్లో అందరికీ తెలుసు. అయితే, ఆమె తల్లిదండ్రులకు మాత్రం నాగేంద్రపై సదభిప్రాయం లేదు.
గతవారం వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోగా, నరసయ్య ఫిర్యాదు మేరకు మైనర్ గా ఉన్న లక్ష్మిని తెచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.

ఆపై రెండో రోజునే లక్ష్మి తన ఇంట్లో విగతజీవితగా కనిపించింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చెప్పకుండా పెళ్లి చేసుకుని బంధువర్గాల్లో తమ పరువు తీసిందన్న కారణంతోనే ఆమెను హత్య చేసినట్టు వారు ఒప్పుకున్నారు. ఈ కేసులో తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News