Harish Rao: అర్ధరాత్రి సమయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ .. మల్లన్నసాగర్ సొరంగం పనుల పరిశీలన

- మల్లన్నసాగర్, పంప్ హౌస్ పనులను పరిశీలించిన హరీశ్ రావు
- రెట్టింపు స్థాయిలో లేబర్ ను పెంచాలి
- యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ ఇరుసు లాంటిదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజ్ 12 పనులను సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. కీలకమైన మల్లన్న సాగర్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రెట్టింపు స్థాయిలో లేబర్ ని పెంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ప్యాకేజ్ 12 కింద మల్లన్న సాగర్ రిజర్వాయర్, కాలువల పనులు జరుగుతున్నాయి. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ నుండి తొగుట మండలం తుక్కపూర్ వరకు సొరంగం, పంప్ హౌస్ పనులను పరిశీలించారు. మల్లన్నసాగర్ కాళేశ్వరంలో వ్యూహాత్మక ప్రదేశమని, ఇది ఎత్తైన ప్రాంతంలో ఉందని, ఈ సొరంగం దాదాపు 17 కిలోమీటర్లు ఉండగా పనులు పూర్తి స్థాయిలో జరిగాయని తెలిపారు.



జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి ఈ యంత్ర సామాగ్రి రవాణా అవుతోంది. కన్నేపల్లి దగ్గర్ గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ , హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఫోర్ బే వరకు చేరిన నీటిని శక్తిమంతమైన విద్యుత్ మోటార్ల ద్వారా ఎత్తి అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించనున్నారు. ఇందుకోసం కన్నేపల్లి పంపు హౌజ్ లో 17 మోటార్లు అమర్చనున్నారు. నీటిని పంపింగ్ చేయడానికి గాను 5 మీటర్లు, 3.5 మీటర్ల వ్యాసార్థంతో ఉన్న భారీ పైపులను నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. కన్నేపల్లి పంపు హౌజ్ నుంచి దాదాపు కిలోమీటరున్నర దూరం వరకు పైపుల ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి నీటిని నింపనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ పనులు మరింత ఊపందుకున్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ప్రాజెక్టు అవసరాలకు ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.