polavaram: ‘పోలవరం’ పనుల్లో అవకతవకలకు ఆస్కారమే లేదు : మంత్రి దేవినేని

  • కేంద్ర కమిటీ కూడా ఇదే స్పష్టం చేసింది
  • మే నెలాఖరుకు డయాఫ్రమ్ వాల్ పనుల పూర్తి
  • ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని

నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు ఆస్కారమే లేదని, రెండ్రోజుల కిందట ఢిల్లీ నుంచి వచ్చిన ఎక్స్ పెర్ట్ కమిటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మసూద్ హుస్సేన్ అధ్యక్షతన ఉన్న ఎక్స్ పెర్ట్ కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను రెండ్రోజుల కిందట పరిశీలించిన విషయాన్ని మంత్రి చెప్పారు. గత ఏడాది అక్టోబర్ లో తాము పోలవరం పనులు పరిశీలించామని, ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఎంతో ప్రగతి ఉందని ఆ కమిటీ రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పిందని అన్నారు. 3డి నమూనా కూడా సిద్ధమైందని, త్వరలో మిగిలిన డిజైన్లకు సంబంధించి అనుమతులు మంజూరు చేస్తామని కమిటీ తెలిపినట్టు చెప్పారు. ల్యాండ్ ఎక్విజేషన్ కు సంబంధించి నాబార్డు నుంచి నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో నష్టపరిహారం జమవుతోందని, డయాఫ్రమ్ వాల్ పనులు మే నెలాఖరుకు పూర్తి చేస్తామని తెలిపారు.

దేశంలో 16 జాతీయ సాగునీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, వాటిలో ‘పోలవరం’ పనులే శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరవాత తమ ప్రభుత్వ హయాంలో మూడున్నరేళ్లలో రూ.8 వేల కోట్లకు పైబడి ఖర్చు చేశామని, దాంట్లో కేంద్రం నుంచి రూ.2,727 కోట్లు ఇంకా రావాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టు చెప్పారు. వచ్చే జూన్ మొదటి వారానికి గోదావరి వరద ప్రవాహం పెరుగుతుందని, ఈలోగా కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం వేచిచూడకుండా, ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగడానికి రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులు వెచ్చిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆశీస్సులతో ప్రాజెక్టు పనులను లక్ష్యంలోగా పూర్తి చేస్తామని, నీరు - ప్రగతి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని దేవినేని తెలిపారు.

కాగా, ప్రతి వారంలాగే సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో 54వ వర్చువల్ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో దేవినేనితో పాటు కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. నేటి వరకూ జరిగిన పనుల వివరాలను దేవినేని ఈ సందర్భంగా వివరించారు. 

  • Loading...

More Telugu News