KTR: అక్రమ మైనింగ్‌ను సహించేది లేదు .. క్రిమినల్ కేసులు నమోదు చేయండి: మంత్రి కేటీఆర్ ఆదేశాలు

  • గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశం
  • సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలి
  • రాష్ట్రంలో త్వరలో మైనింగ్ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

అక్రమ మైనింగ్‌ను సహించేది లేదని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దని, ఒత్తిడికి గురికావద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ రోజు గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కేటీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో తీసుకురానున్న మైనింగ్ పాలసీలో దేశంలోని అత్యుత్తమ విధానాలను చేకూర్చుతామని, ఈ పాలసీని చట్టరూపంలో తీసుకువస్తామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని సున్నపు రాయి గనుల లీజుపైనా చర్చించారు. ఈ గనులకు జాతీయ స్థాయి వేలం నిర్వహిస్తున్నామని, భవిష్యత్ లో అంతర్జాతీయ స్థాయి వేలం నిర్వహించాలని అన్నారు.

ఈ - ఆక్షన్  ద్వారానే గనుల, ఇసుక రీచ్ ల లీజులు జరగాలి

గనుల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా గనుల పర్యవేక్షణలో జియోఫెన్సింగ్, జియో ట్యాగింగ్, ఉపగ్రహా చిత్రాల ఉపయోగం, డ్రోన్ల వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ - ఆక్షన్  ద్వారానే గనుల, ఇసుక రీచ్ ల లీజులు జరగాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పర్యావరణ సమతుల్యత కోసం రాక్ సాండ్ వినియోగాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి, అర్ అండ్ బి శాఖల నిర్మాణాల్లో దీని వినియోగం పెంచడం కోసం అయా శాఖల ఇంజనీరింగ్ శాఖాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. టీఎస్ ఎండీసీ సైతం రాక్ సాండ్ క్రషర్ల ఏర్పాటును పరిశీలించాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో చేపట్టిన సాండ్ టాక్సీ విధానం విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని, రాష్ట్రంలో ఇసుక ఏ ధరకు లభిస్తుందనే విషయం ఒక్క ఫోన్ కాల్ ద్వారా అందరికీ తెలిసే విధానం ఉండాలని అన్నారు.
 
గనుల శాఖ ఆదాయం లక్ష్యాన్ని సాధించింది

ఈ ఆర్థిక సంవత్సరానికిగాను గనుల శాఖ ఆదాయం లక్ష్యాన్ని సాధించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సంవత్సరానికి గాను నిర్దేశిత రూ. 3166 కోట్ల లక్ష్యానికి గాను మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా ఫిబ్రవరీ నెఖరుకు సూమారు మూడు వేల 500 వందల కోట్ల రూపాయలు ( 110 శాతం ) ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, ముఖ్యంగా ఇసుక ఆదాయ లక్ష్యం రూ. 388 కోట్లకు గాను రూ. 538 కోట్ల ఆదాయం ( 139 శాతం ) ఖజనాకు లభించినట్లు తెలిపారు. మైనింగ్ ఆదాయంలోని లీకేజీలను సాధ్యమైనంత ఎక్కువగా అరికట్టామని, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన ఈ సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఎంఎన్ ఎండీసీ డైరెక్టర్ , ప్రతినిధులతో ఇనుప ఖనిజం కేటాయింపులపై చర్చించారు. ఇప్పటికే పలు సార్లు కేంద్రాన్ని కోరినా బయ్యారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన త్వరలోనే కేంద్ర గనుల శాఖ, స్టీల్ శాఖ మంత్రులను కలుస్తామని కేటీఆర్ చెప్పారు.

477 లీజుల రద్దు చేశాం : గనుల శాఖల అధికారులు

కాగా, గత సంవత్సకాలంలో గనుల శాఖలో అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు. వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 354 తనిఖీలు నిర్వహించామని, 79 ఉల్లంఘనలు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలో గనులు లీజు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించని 477 లీజులను రద్దు చేసిన విషయాన్ని కేటీఆర్ దృష్టికి తెచ్చారు.

  • Loading...

More Telugu News