Telangana: ఆ ఇజాలు పోతున్నాయి .. ఇప్పుడున్నది అంబేద్కర్ ఇజమే : కడియం శ్రీహరి

  • సికింద్రాబాద్, బొల్లారం, ఆదర్శ నగర్ లో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణ
  • గాంధీ, నెహ్రూ ఇజాలు, సోషలిజం పోతున్నాయి
  • రాజ్యాంగం వల్లే ఈరోజున నేను ఉప ముఖ్యమంత్రిని కాగలిగా
  • దళిత సమస్యలపై సహృదయంతో స్పందిస్తున్న కేసీఆర్ : కడియం

గాంధీ, నెహ్రూ ఇజాలు, సోషలిజం పోతున్నాయని, ఇప్పుడున్నది కేవలం అంబేద్కర్ ఇజమేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సికింద్రాబాద్, బొల్లారం, ఆదర్శనగర్ లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాలను ఈరోజు ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ రామచంద్రారావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజా గాయకులు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లు కేవలం దళిత నాయకులు మాత్రమే కాదని, ప్రపంచానికే నాయకులని అన్నారు. దళితులకు పరిపాలన రాదని చెప్పే కాలంలో బాబు జగ్జీవన్ రామ్ గొప్ప నాయకుడిగా నిరూపించుకున్నారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాను ఈరోజున ఉప ముఖ్యమంత్రిని కాగలిగానని అన్నారు. తెలంగాణలో దళితుల సమస్యలపై సీఎం కేసీఆర్ సహృదయంతో స్పందిస్తున్నారని అన్నారు. అనంతరం ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో వారానికి ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నానని అన్నారు. అందరికి సమాన రిజర్వేషన్లు ఉండాలని పార్లమెంట్ లో పోరాడుతున్నామని, దేశంలో బెస్ట్ సీఎం కేసీఆర్ అని, కంటోన్మెంట్ రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News