Telangana: తెలంగాణకు నెంబర్ వన్ శత్రువు కాంగ్రెస్..ఈ మాట పద్దెనిమిదేళ్ల క్రితమే చెప్పాను : సీఎం కేసీఆర్

  • కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు
  • కాంగ్రెస్ వాళ్లు ఏ పని చెయ్యాలన్నా ఢిల్లీ పర్మిషన్ కావాలి!
  • నాడు తెలంగాణను ఏపీలో కలపడానికి కారణం జవహర్ లాలే  
  • అసెంబ్లీలో విమర్శలు గుప్పించిన కేసీఆర్

తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని పద్దెనిమిదేళ్ల క్రితమే తాను చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని నాడు అన్ని పత్రికల్లో మొదటి పేజీల్లో రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో టేప్ కూడా తన వద్ద ఉందని, అవసరమైనప్పుడు టెలికాస్ట్ చేస్తానని అన్నారు. నాటి నుంచి నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని, నిన్న ఈ సభ నుంచి వారిని బహిష్కరించే వరకు కూడా అలానే ప్రవర్తించారని విమర్శించారు.

 కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏ పని చెయ్యాలన్నా ఢిల్లీ పర్మిషన్ కావాలని అంటుంటారని, వారు మూకుమ్మడి రాజీనామాలు చెయ్యొచ్చుగా, దీనికి కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలా? అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు. ‘తెలంగాణ  ప్రజల మనోభావాలను కాలరాసి నాడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో కలపడానికి కారణం ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ. అందుకు తోకలూపి ఒప్పుకున్న వాళ్లు నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. నాటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత వారిని ‘ఏమైందయ్యా’ అని కొంతమంది అడిగితే..‘ఏమంటామండీ, నెహ్రూ సాబ్ చెప్పిండుకలిపేస్తామని. ఇక, గాయన ముంగట ఏం మాట్లాడతాం’ అని వారు సమాధానం చెప్పారు. తెలంగాణ మునిగిపోవడానికి కారణం నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, అందుకు తోకాడించి, తలకాయలూపి వచ్చిన నాటి కాంగ్రెస్ నాయకత్వం..ఇదంతా నేను సొంతగా చెబుతున్న స్టోరీ కాదు.. చరిత్ర’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News