Erode: తమిళ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కమల్

  • తమిళనాడులో మహిళ భద్రత పట్ల వ్యవహరించే తీరు సిగ్గుచేటు
  • తనకు క్రిస్టియన్ మిషనరీలు నిధులందిస్తున్నాయనడం హాస్యాస్పదం
  • సమాజం పట్ల ఆందోళన ఉన్న వాళ్లే రాజకీయాల్లోకి వస్తున్నారని చురక

అన్నాడీఎంకే నేతృత్వంలోని తమిళనాడు సర్కార్‌పై ప్రముఖ నటుడు, 'మక్కళ్ నీది మయ్యమ్' అధ్యక్షుడు కమల్ హాసన్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల భద్రత పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. రెండు రోజుల ఈరోడ్‌ పర్యటన సందర్భంగా శనివారం ఆయన పెరుందురైలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మార్పు సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మరోవైపు క్రిస్టియన్ మిషనరీలు తనకు నిధులు సమకూర్చుతున్నాయన్న ఆరోపణలను ఆయన ఖండిచారు. "క్రిస్టియన్ మిషనరీలు నాకు నిధులిస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. అవన్నీ ఒట్టి అబద్ధాలు. ఇందుకు నవ్వడం తప్ప మరేమీ చెయ్యలేను. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారన్నది విషయం కాదు. సమాజం పట్ల ఆందోళన, బాధ్యత ఉన్న వాళ్లే రాజకీయాల్లోకి వస్తున్నారు" అని కమల్ పరోక్షంగా తనను విమర్శించిన వాళ్లకు చురకలు అంటించారు. అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలు తమ తప్పులను సరిదద్దుకోకుంటే తాము అధికారాన్ని చేపట్టాల్సి ఉంటుందని విశ్వనాయకుడు హెచ్చరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News