Chandrababu: వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్ రూ.19,070.36 కోట్లు

  • రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
  • ప్రాథమిక రంగంలో గతేడాది మొదటి అర్ధ సంవత్సరంలో 25.6 వృద్ధి సాధించాం
  • రెండో అర్ధ సంవత్సరంలో 25.4 శాతం వృద్ధి సాధించాం
  • రబీలో 42 శాతం వర్షపాతం తక్కువగా నమోదు-సోమిరెడ్డి

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రాథమిక రంగంలో మొదటి అర్ధ సంవత్సరంలో గతేడాది 25.6 వృద్ధి సాధించామని, రెండో అర్ధ సంవత్సరంలో 25.4 శాతం వృద్ధి సాధించామని తెలిపారు.

రబీలో 42 శాతం వర్షపాతం తక్కువగా నమోదయిందని చెప్పారు. వరి దిగుబడి స్వల్పంగా తగ్గినా హెక్టారుకు 5176 కిలోల ఉత్పత్తి నమోదు అవుతోందని అన్నారు. రైతులకు రాయితీతో సూక్ష్మ పోషకాల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా 100 శాతం రాయితీతో సూక్ష్మ పోషకాల ఎరువులను రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. విత్తనాల సరఫరా విషయంలో సకాలంలో నాణ్యమైన విత్తనాలను రాయితీపై రైతులకు పంపిణీ చేశామని అన్నారు.

మొక్కజొన్న ఉత్పాదనలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. వరి ఉత్పాదనలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని అన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్ రూ.19,070.36 కోట్లు అని ప్రకటించారు. వ్యవసాయ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.18602.98 కోట్లని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4730 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా తంగడంచలో అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పామని అన్నారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగం తరుచుగా నష్టపోతోందని, వాటివల్ల నష్టపోయిన 16,38,000 మంది రైతులకి 1904 కోట్ల 63 లక్షల రూపాయల పెట్టుబడి రాయితీని వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అధిక ఉత్పాదకతను సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి పెట్టామని చెప్పారు. రైతు పథకం కింద రూ.2.50 లక్షల రాయితీతో ట్రాక్టర్లు మంజూరు చేశామని అన్నారు. 

  • Loading...

More Telugu News