murder: ప్రియురాలిని కడతేర్చిన మరుసటి రోజే మరోయువతి మెళ్లో తాళి కట్టాడు!

  • ఆత్మకూరులోని వినాయక ఆసుపత్రిలో పని చేస్తున్న భార్గవి, నరేందర్
  • భార్గవి, నరేందర్ మధ్య నాలుగేళ్ల ప్రేమ
  • పెళ్లి కుదరడంతో భార్గవిని హత్యచేసిన నరేందర్

ప్రియురాలిని వంచించి, ఆమెను హతమార్చిన మరుసటి రోజే మరోయువతి మెళ్లో తాళికట్టిన ఓ మోసగాడు, ఆ మర్నాడే పోలీసులకు పట్టుబడిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య కుమార్తె భార్గవి (23) డిగ్రీ వరకు చదివి, ఆత్మకూర్‌ (ఎం) మండల కేంద్రంలోని వినాయక ఆసుపత్రిలో పని చేస్తోంది. బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని సత్తయ్య కుమారుడు నరేందర్‌ (28) అలియాస్‌ నరేశ్‌ అదే ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నరేందర్ కి నాలుగేళ్ల క్రితమే వివాహమైనా, పెళ్లైన 15 రోజులకే విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. నాలుగేళ్ల ప్రేమలో పెళ్లి చేసుకుంటానని భార్గవిని లోబర్చుకున్నాడు.

ఆ తర్వాత కులాలు వేరని చెబుతూ ఆమెను దూరం పెట్టిన నరేందర్‌, మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో భార్గవి అతనిని నిలదీసింది. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుందామని ఆమెను నమ్మించి, గత శనివారం బుజిలాపురం సమీపంలోని తమ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి, వెనుకనుంచి రాయితో ఆమె తలపై మోది హతమార్చాడు. అనంతరం అదే బావి వద్ద ఆమెను పూడ్చి పెట్టి ఏమీ తెలియనట్టు ఇంటికెళ్లిపోయాడు.

మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో భార్గవి కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి, నరేందర్ పై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పెళ్లయిన మరుసటి రోజు పోలీసులు నరేందర్ ను విచారించగా, తన పెళ్లికి అడ్డుగా ఉండడంతోనే భార్గవిని హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో తన వ్యవసాయ బావివద్ద గల మొరం గడ్డ వద్ద గుంతతీసి మృతదేహాన్ని పాతిన ప్రదేశాన్ని చూపెట్టాడు. మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు, నరేందర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.

  • Loading...

More Telugu News