KTR: అప్పెరెల్ పార్కుకు పునర్వైభవం.. 15 వేల ఉద్యోగాలు: మ‌ంత్రి కేటీఆర్

  • అప్పెరెల్ రంగానికి చెందని యూనిట్ల లీజులు రద్దు చేస్తాం
  • పార్కు నిర్వహణ పూర్తిగా టెక్స్ టైల్  శాఖ పరిధిలోకి తీసుకువస్తాం
  • అప్పెరెల్ పార్కు నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక సీఈవో 
  • అప్పెరెల్ పార్కులో హ్యాండి క్రాప్ట్, అర్టిసాన్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు

రంగారెడ్డి జిల్లాలోని గుండ్ల పోచంపల్లి అప్పెరెల్ పార్కుకు పునర్వైభవం తీసుకొస్తామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఈ విష‌య‌మై కేటీఆర్‌... టెక్స్ టైల్, టీఎస్ఐఐసీ అధికారులతో చర్చించారు. ప్ర‌ధానంగా పార్కులోని యూనిట్ల పనితీరు, ఉపాధి కల్పన, విస్తరణకు ఉన్న అవకాశాలపైన మంత్రి సూచ‌న‌లు చేశారు. పార్కులో అన్ని యూనిట్లు క‌చ్చితంగా అప్పెరెల్ రంగానికి చెందినవే అయి ఉండాలని, ఈ పరిశ్రమలకు సంబంధం లేకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూనిట్ల స్థ‌లాలను వెంటనే రద్దు చేయాలని టీఎస్ ఐఐసీ ఎండీతో పాటు సంబంధిత‌ అధికారులను అదేశించారు.

ఈ పార్కులో అప్పెరెల్ రంగానికి సంబంధంలేని ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తోన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అప్పెరెల్ పార్కు నగరానికి అత్యంత దగ్గర ఉన్నందున అనేక కంపెనీలు ఇక్కడ యూనిట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాంటి కంపెనీల‌కు పారదర్శక పద్ధ‌తిలో తిరిగి ఈ ప్లాట్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఈ అప్పెరెల్ పార్కులోని అన్ని యూనిట్లు పనిచేస్తే కనీసం 15 వేల మందికి నేరుగా, అంతకు రెండు రెట్లు ప‌రోక్షంగా ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందన్నారు.

పార్కు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులోని అన్ని యూనిట్లను తనిఖీ చేసి పూర్తి వివరాలను సేకరించాలన్నారు. ఒక్కో యూనిట్ అందిస్తోన్న ఉపాధి, పెట్టుబడుల వంటి అంశాలపైన వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. పార్కులో మౌలిక వసతుల కల్పనకే టీఎస్ ఐఐసి పరిమితం అవుతుందని, పార్కు నిర్వహణ, నూతన యూనిట్లను పార్కుకు తీసుకుని రావడం వంటి కార్యక్రమాలను పూర్తిగా టెక్స్ టైల్ శాఖ తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

టీఎస్ ఐఐసీ పరిధిలో ఉన్న పాశమైలారం, గుండ్లపోచంపల్లి అప్పెరెల్ పార్కులను పర్యవేక్షించేందుకు సీఈవోను ప్రత్యేకంగా నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పార్కులో హ్యాండిక్రాప్ట్ శిక్షణ కేంద్రం, అర్టిసాన్ ట్రయినింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పార్కుకు అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాల కల్పన చేసేందుకు టీఎస్ ఐఐసీ చర్యలు తీసుకోవాలని కోరారు. పార్కులో ఏల్ఈడీ లైట్లు, ఆహార భోజన శాల, రోడ్లు, గ్రీనరీ వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో టీఎస్ ఐఐసీ, టెక్స్ టైల్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News