Sridevi: ప్రపంచానికి చాందిని.. నాకు స్నేహితురాలు.. అంత్యక్రియల అనంతరం ప్రకటన విడుదల చేసిన బోనీ

  • పిల్లలకు ఆమే సర్వస్వం
  • శ్రీదేవి లేకుండా ముందుకు ఎలా వెళ్లాలో తెలియడం లేదు
  • ఆమె జ్ఞాపకాలు చెరిగిపోయేవి కావు

అశేష అభిమానుల అశ్రునయనాల మధ్య నటి శ్రీదేవి అంత్యక్రియులు ముగిసిన తర్వాత ఆమె భర్త బోనీ కపూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ స్నేహితురాలిని, భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని కోల్పోయిన బాధను వర్ణించలేకపోతున్నానని అందులో పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. కుటుంబం, స్నేహితులు, కుమారుడు అర్జున్, కుమార్తెలు అన్షులా, జాన్వి, ఖుషీలతోపాటు కోట్లాదిమంది అభిమానులు తనకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఓ కుటుంబంగా తామీ బాధను భరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

ప్రపంచానికి ఆమె చాందిని అని, తనకు మాత్రం ప్రేమమూర్తి, స్నేహితురాలు, భాగస్వామి, ఇద్దరు పిల్లలకు తల్లి అని పేర్కొన్నారు. తన పిల్లలకైతే ఆమే సర్వస్వమని పేర్కొన్నారు. ఆమె జ్ఞాపకాలు చెరిగిపోయేవి కావని, వెండి తెర ఉన్నంత వరకు ఆమె జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం తన ముందున్న సమస్య శ్రీదేవి లేకుండా ఇద్దరు పిల్లలతో కలిసి ముందుకు ఎలా వెళ్లాలన్నదేనని.. అదే తనను ఆందోళనకు గురిచేస్తోందని బోనీ పేర్కొన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు బోనీ తెలిపారు.

  • Loading...

More Telugu News