TR Zeliang: నాగాలాండ్ ఎన్నికల్లో అపశ్రుతి...పోలింగ్ బూత్ వద్ద బాంబు పేలుడు... ఒకరికి గాయాలు

  • నాగాలాండ్‌లోని లిజిత్ బూత్ వద్ద పేలుడు
  • తెల్లవారుజామున క్రూడ్ బాంబు అమర్చినట్లు సమాచారం
  • సంపూర్ణ మెజార్టీ సాధిస్తామని నాగాలాండ్ సీఎం విశ్వాసం

మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ రోజు ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. నాగాలాండ్ రాష్ట్రంలోని మాన్ జిల్లా, తిజిత్ ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేషన్‌లో ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఓ గ్రామ కౌన్సిల్ మెంబర్‌గా గుర్తించారు.

ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఓ క్రూడ్ బాంబును పోలింగ్ స్టేషన్ వద్ద అమర్చినట్లు సమాచారం. నాగాలాంగ్‌ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే ఓ స్థానంలో ఎన్నిక నిలిచిపోవడంతో 59 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు మొదలయింది. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఇక్కడ మొత్తం 2156 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ తమ పార్టీ సంపూర్ణ మెజార్టీని సాధిస్తుందనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఇక మేఘాలయలోనూ 60 అసెంబ్లీ స్థానాలుండగా ఓ స్థానంలో ఓటింగ్ నిలిచిపోగా 59 స్థానాలకే పోలింగ్ జరుగుతోంది. షిల్లాంగ్‌లోని ఎంటీడీసీ ఆఫీస్ నార్త్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మేఘాలయ రాష్ట్ర గవర్నరు గంగా ప్రసాద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్రిపురతో పాటు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3న ప్రకటిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌లతో బీజేపీ పోటీ పడుతోంది.

  • Loading...

More Telugu News