Jammu And Kashmir: ఇంతకంటే దారుణం మరోటి ఉండదేమో! కిడ్నాపైన బాలికను వెతికేందుకు వెళ్లి అత్యాచారం చేసి చంపేసిన పోలీసు అధికారి!

  • బాలికను వారం పాటు బంధించి మరో బాలుడితో కలిసి అత్యాచారం
  • ఆపై చంపేసి పొలాల్లో పడేసిన వైనం
  • అధికారి అరెస్ట్.. నేరాన్ని అంగీకరించిన నిందితుడు

పోలీసులపై ఉన్న కాస్తోకూస్తో గౌరవాన్ని కూడా ఈ పోలీసు అధికారి తుంచేశాడు. కిడ్నాపైన బాలికను వెతికి పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా చంపేశాడు. జమ్ముకశ్మీర్‌లో జరిగిందీ ఘటన. ప్రస్తుతం ఆ పోలీసు అధికారి కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు.

ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్ముకు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే కతువా జిల్లా, రసనా గ్రామంలోని నోమాద్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలిక జనవరి 10న గుర్రాలను మేపుతుండగా కిడ్నాపైంది. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వెతికిపట్టుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీములో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌పీవో) దీపక్ ఖుజారియా (28) కూడా ఉన్నాడు. ఈ క్రమంలో బాలికను గుర్తించిన ఖుజారియా ఆమెను వారం పాటు బంధించి మరో బాలుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను దారుణంగా హత్య చేసి పొలాల్లో పడేశాడు.

సరిగ్గా వారం తర్వాత జనవరి 17న పొలాల్లో కనిపించిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఈ ఘటన వెనక దీపక్ ఖజురియా హస్తం ఉందని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం, హత్య వెనుక దీపక్ హస్తం ఉందనేందుకు అన్ని సాక్ష్యాలు ఉన్నట్టు అదనపు డైరెక్టర్ జనరల్ అలోక్ పురి తెలిపారు. దీపక్ తన నేరాన్ని అంగీకరించినట్టు పేర్కొన్నారు. కాగా, తమకు న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు, నోమా తెగవారు ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News