amaravathi: అమరావతిలో స్మార్ట్ బైక్ ల తయారీ యూనిట్ ప్రతిపాదన!

  • సచివాలయంలో స్మార్ట్ బైకులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు మొత్తం రూ.30 లక్షలు
  • విశాఖ, విజయవాడ, తిరుపతిలోనూ స్మార్ట్ బైక్ లు ప్రవేశపెట్టాలి
  • ఆలిండియా బైసైకిలింగ్ ఫెడరేషన్ కు  చంద్రబాబు సూచన

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో కూడా స్మార్ట్ బైకులు ప్రవేశపెట్టాలని ఆలిండియా బైసైకిలింగ్ ఫెడరేషన్ వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయం ప్రాంగణం 2వ బ్లాక్ ఎదురుగా ఈరోజు ఉదయం ఆయన స్మార్ట్ బైక్ స్టాండ్, స్మార్ట్ బైకులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్మార్ట్ కార్డ్ ద్వారా డిజిటల్ తాళం తీసే పద్ధతి,  బైకుని ఉపయోగించే విధానాన్ని నిర్వాహకులు సీఎంకు వివరించారు. సచివాలయం వద్ద మూడు స్టాండులు, 24 స్మార్ట్ బైకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బైక్ కు ఉన్న బుట్టలో హెల్మెట్ కూడా ఉంది. ఆంధ్రా బ్యాంకు వారి సౌజన్యంతో ఈ బైకులు ఏర్పాటు చేసినట్లు, ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సీఎంకు చెప్పారు. అత్యంత ఆధునికమైన, అత్యుత్తమమైన ఈ సైకిళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నట్లు, ప్రభుత్వం అనుమతిస్తే త్వరలో అమరావతిలో అసెంబ్లింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు ఆలిండియా బైసైకిలింగ్ ఫెడరేషన్ చైర్మన్ డివి మనోహర్ సీఎంకు చెప్పారు. ఇంతకు ముందు ఎక్కడా లేని విధంగా ఈ బైక్ స్టాండ్ డిజైన్ చేసినట్లు తెలిపారు. మిగిలిన నగరాలలో కూడా ప్రవేశపెడతామని చెప్పారు. సైకిల్ రేసులు కూడా నిర్వహించాలని ఆయనకు చంద్రబాబు సూచించారు. బైక్ స్టాండ్ నిర్మాణం చూసి సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు, స్టాండ్ చుట్టూతా మొక్కలు పెంచి కలర్ ఫుల్ గా తయారు చేయాలని, సందర్శకులు ఇక్కడ కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

అలాగే, ఇక్కడ సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసి ఏసీకి, విద్యుత్ వాహనాలకు వినియోగించే ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు. విజయవాడ-గుంటూరు మధ్య కూడా ఇటువంటి సైకిళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని, స్మార్ట్ బైక్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించమని శ్రీధర్ ను ఆదేశించారు. అనంతరం, సీఎం స్వయంగా సైకిల్ తొక్కుతూ 1వ బ్లాక్ లోని తన కార్యాలయానికి వెళ్లారు. కాగా, అమరావతిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ బైక్ ప్రాజెక్టుకు అయిన ఖర్చు మొత్తం రూ.30 లక్షలు ఆంధ్రాబ్యాంక్ ఇచ్చినట్లు  శ్రీధర్ తెలిపారు. 
స్మార్ట్ బైక్ ఉపయోగించే విధానం

సచివాలయం బయట బస్టాండ్ వద్ద, లోపల 5వ బ్లాక్, 2వ బ్లాక్ వద్ద స్మార్ట్ బైక్ స్టాండ్ లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు చోట్ల ఎక్కడైనా బైక్ తీసుకోవచ్చని, ఎక్కడైనా పార్క్ చేయవచ్చని తెలిపారు. పేరు నమోదు చేయించుకున్నవారికి సభ్యత్వ స్మార్ట్ కార్డు ఇస్తారని, ఆ కార్డు ద్వారా బైక్ డిజిటల్ తాళం తీయవచ్చని వివరించారు. యాప్ ద్వారా కూడా బైక్ తాళం తీయవచ్చని తెలిపారు. బైక్ ని తీసుకొని, ఉపయోగించుకునే వివరాలు స్టాండ్ వద్ద శాశ్వతంగా ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం ఈ బైకులను ఉచితంగా వినియోగించుకోవచ్చని, దేశంలోని ఇతర  ప్రాంతాల్లో రెండు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ఛార్జి వసూలు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 

  • Loading...

More Telugu News