Telangana: ‘గవర్నర్ ఎట్ హోమ్’కు వెళ్లొద్దన్నా హాజరైన ఇద్దరు టీ-కాంగ్రెస్ నేతలు!

  • టీ-కాంగ్రెస్ నిర్ణయాన్ని పక్కన బెట్టిన రాపోలు ఆనంద భాస్కర్, దానం నాగేందర్
  • నాకు ఎలాంటి సమాచారం లేదు
  • వెళ్లొద్దని చెబితే వెళ్లేవాడిని కాదు: రాపోలు
  • ఇంకా స్పందించని దానం నాగేందర్

టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారంటూ టీ-కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని బహిష్కరించాలని టీ-కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, రాపోలు ఆనందభాస్కర్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంఘటన టీ-కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఈ విషయమై రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని తనకు ఎలాంటి సమాచారం లేదని, వద్దని చెబితే వెళ్లేవాడిని కాదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. కాగా, ఈ విషయమై దానం నాగేందర్ స్పందించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News