Nodia: కుమార్తె గదిలో బాయ్‌ఫ్రెండ్‌.. ఘర్షణ.. కిందపడి మరణించిన తండ్రి.. అయితే ఏంటి? అంటూ పోలీసులను ప్రశ్నించిన కూతురు!

  • కుమార్తె బాయ్ ఫ్రెండ్‌తో తండ్రి ఘర్షణ
  • పట్టుతప్పి కిందపడిన తండ్రి.. ఆసుపత్రిలో మృతి
  • కుమార్తె అరెస్ట్.. పరారీలో బాయ్‌ఫ్రెండ్

అర్ధరాత్రి దాటాక కుమార్తె గదిలో ఏదో అలికిడి వినిపిస్తే కళ్లు నులుముకుని వెళ్లి చూసిన తండ్రికి గుండె ఆగినంత పనైంది. ఆమె మంచంపై బాయ్‌ఫ్రెండ్ కనిపించడంతో హతాశుడయ్యాడు. దగ్గరికి వెళ్లి అతడితో గొడవపడ్డాడు.. తర్వాత పట్టుతప్పి కిందపడ్డాడు.. ఈసారి నిజంగానే గుండె ఆగిపోయింది. నోయిడాలోని అట్టా గ్రామంలో జరిగిందీ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన విశ్వనాథ్ సాహు (45) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె పూజ (21), భార్య గాయత్రితో కలిసి ఓ భవనంలోని మూడో అంతస్తులో నివసిస్తున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉండే ధర్మేంద్ర (24)తో పూజకు ఏడాది కాలంగా పరిచయం ఉంది.

ఆదివారం తెల్లవారుజామున  2:30 గంటలకు కుమార్తె గదిలో నుంచి ఏదో అలికిడి వినిపించడంతో విశ్వనాథ్ లేచి ఆమె గదిలోకి వెళ్లాడు. అక్కడ ధర్మేంద్ర కనిపించడంతో విస్తుపోయాడు. అతడితో గొడవపడ్డాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మరింత పెద్దదైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ కిందికి వస్తూ పట్టు తప్పి మెట్లపై నుంచి జారి కిందపడ్డాడు.

తీవ్రంగా గాయపడిన విశ్వనాథ్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ విశ్వనాథ్ మృతి చెందాడు. ఆయన భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ధర్మేంద్ర కోసం గాలిస్తున్నారు. తండ్రి చనిపోయినా కుమార్తె పూజలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. ‘జరిగిందేదో జరిగిపోయింది’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News