swathi: ప్రియుడే ముద్దంటూ భర్తను హత్య చేయిస్తున్న భార్యలు... టీఎస్, ఏపీల్లో మూడు నెలల్లో 9 ఘటనలు

  • తమ ప్రేమాయణాల కోసం భర్తల హత్య
  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న అక్రమ సంబంధాలు
  • పిల్లలను అనాధలుగా మార్చుతున్న వైనం
  • పోలీసులు సైతం అవాక్కయ్యేలా ప్లాన్

వివాహ బంధం తెగిపోతోంది. తమ తమ ప్రేమాయణాలతో జీవిత భాగస్వామిని కడతేర్చేందుకూ వెనుకాడటం లేదు. అక్రమ సంబంధంతో భార్యలను వేధించడం, వారికి విడాకులు ఇవ్వడం, ఇంకాస్త ఉన్మాదిగా మారి భార్యను హత్య చేసిన ఘటనలు ఎన్నో చూసివుంటాం. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పెళ్లికి ముందు ప్రేమో, ఇష్టంలేని పెళ్లి చేశారనో, భర్త వద్ద తనకు కావాల్సిన సుఖం దొరకడం లేదనో... కారణం ఏదైనా కావచ్చు. కాపురాలు సజావుగా సాగుతున్నా, ఉన్నత స్థితిలో ఉన్నా కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఈ సంస్కృతి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

ఓ స్వాతి, ఓ స్నేహ, ఓ శ్రీలత... ప్రేమికుడి మోజులో పడి భర్తలను హత్య చేయించి, పిల్లలను అనాధలుగా మార్చిన వారిలో కొందరు మాత్రమే. గడచిన మూడు నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 9 మంది యువతులు తమ ప్రియుళ్ల కోసం భర్తలను హత్య చేయించారు. పక్కా ప్లాన్ వేసి మరీ దొరికిపోయారు. వీటిల్లో కొన్ని కేసుల వెనుక పోలీసులు సైతం అవాక్కయ్యే నిజాలుండటం గమనార్హం. నాగర్ కర్నూల్ జిల్లాలో స్వాతి - రాజేష్ ఉదంతం వింటే 'ఔరా' అనిపించక మానదు. ఈ నిజం ఓ క్రైమ్ స్టోరీనే తలపించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సుధాకర్ రెడ్డిని, ప్రియుడు రాజేష్ సాయంతో హత్య చేసి, ఆపై రాజేష్ ను తన భర్త స్థానంలోకి తీసుకురావాలని స్వాతి చేసిన పని సంచలనాన్నే కలిగించింది.

ఇదొక్కటే కాదు... సూర్యాపేట సమీపంలో వరుసకు బావ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భారతి అనే యువతి కూడా భర్తను చంపించింది. గత డిసెంబరులో జ్యోతి అనే యువతి, భర్త నాగరాజును హత్య చేయించగా, హత్యకు సహకరించిన ఓ యువకుడు పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఆత్మహత్యాయత్నం చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. ఇవి తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనలు. ఇక ఏపీ విషయానికి వస్తే, కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఇదే తరహా నేరాలు జరిగాయి. శ్రీవిద్య అనే యువతి అక్క భర్తతో సంబంధం పెట్టుకుని, మద్యంలో విషమిచ్చి భర్తను కడతేర్చింది. కర్నూలులో ప్రియుడి సాయంతో భర్త తలపై బండరాయితో మోదింది మరో మహిళ. కడపలో కిరాయి హంతకులను పెట్టి మరీ భర్తను హత్య చేయించిందో ఇల్లాలు.

ఇప్పటివరకూ 9 ఇదే తరహా కేసులు వెలుగులోకి రాగా, ఇటువంటి కేసులు మరిన్ని ఉండవచ్చని రెండు రాష్ట్రాల పోలీసులూ అనుమానిస్తున్నారు. గతంలో పరాయి మహిళ మోజుతో భార్యలను అంతమొందించే కేసులను చూసిన పోలీసులు, ఇప్పుడు ఈ తరహా కేసులను చూసి షాక్ చెందుతున్నారు. శారీరక ఆకర్షణతో పాటు, విలాసవంతమైన జీవితం, పెళ్లికి ముందు ప్రేమాయణం తదితరాలు, పెళ్లి నాటి ప్రమాణాలు, సాంఘిక నిబంధనలను పిల్లల భవిష్యత్తునూ నాశనం చేస్తున్నాయని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. మారుతున్న సమాజం, సినిమాలు, సీరియళ్ల ప్రభావం, బలవంతపు పెళ్లిళ్లతో పాటు అశ్లీల సాహిత్యం, విశృంఖల లైంగిక వాంఛలు ఇందుకు కారణమని అంటున్నారు.

  • Loading...

More Telugu News