China: మరో 'శీను'... 12 ఏళ్లు మూగవాడిగా నాటకమాడి, నిజంగానే మూగవాడిగా మారిపోయిన యువకుడు!

  • భార్య అంకుల్ ను హత్య చేసి పారిపోయిన వ్యక్తి
  • మూగవాడిగా నటిస్తూ 12 ఏళ్ల కాలం మనుగడ
  • డీఎన్ఏ పరీక్షలతో పోలీసులకు చిక్కిన వైనం

మీకు వెంకటేశ్ హీరోగా నటించిన 'శీను' చిత్రం గుర్తుందా? ఓ పుష్కర కాలం క్రితం వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ కు దగ్గరయ్యేందుకు హీరో మూగవాడిగా నటిస్తాడు. చివరకు మాట కోల్పోతాడు. అచ్చం అలాగే కాకున్నా, కాస్తంత వైవిధ్యంతో కూడిన అటువంటి ఘటనే ఇది. ఓ హత్య చేసి, అందులో ఇరుక్కోకుండా ఉండేందుకు 12 సంవత్సరాల కాలం పాటు మాట్లాడకుండా ఉండిపోయిన ఓ వ్యక్తి, చివరకు మూగవాడిగా మిగిలాడు. ఈ ఘటన చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్స్ ప్రాంతంలో జరిగింది.

2005లో తన జీవిత భాగస్వామి బంధువును హత్య చేసిన జెంగ్ అనే వ్యక్తి చట్టానికి చిక్కకుండా తప్పించుకోవాలని చూశాడు. ఇంటి అద్దె విషయంలో 500 యువాన్ ల కోసం (సుమారు రూ. 3,500) జరిగిన గొడవ తరువాత జెంగ్, తన భార్య అంకుల్ ను హత్య చేశాడు. ఆపై మరో ప్రాంతానికి పారిపోయాడు. పేరును మార్చుకున్నాడు. మూగవాడిగా పరిచయం చేసుకున్నాడు. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని తండ్రయ్యాడు.

అయితే, అతని వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలూ లేవు. ఇటీవలి తనిఖీల్లో పోలీసులకు అనుమానం వచ్చి డీఎన్ఏ పరీక్షలు చేయగా, ఓ పరారీలో ఉన్న హంతకుడి తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోయింది. దీంతో జెంగ్ వ్యవహారం బట్టబయలైంది. అయితే, 12 సంవత్సరాల నుంచి స్వరపేటికకు పని లేకపోవడంతో అతను మూగవాడిగా మిగిలిపోవడం గమనార్హం. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉండగా, నేరం రుజువైతే మరణదండన పడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News