ys jagan: పాదయాత్రకు తొలి బ్రేక్.. సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్!

  • తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న జగన్
  • రోడ్డు మార్గంలో ప్రయాణం
  • 10.30 గంటలకు కోర్టుకు హాజరు

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర'కు నాలుగు రోజుల తర్వాత బ్రేక్ పడింది. అక్రమాస్తుల కేసులో ఆయన నేడు హైదరాబాదులోని సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. పాదయాత్ర నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటిషన్ ను ఇంతకుముందే కోర్టు కొట్టివేసింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఈ క్రమంలో జగన్ పాదయాత్రకు నేడు తొలి బ్రేక్ పడింది. జగన్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసన్, తదితర నిందితులు కూడా కోర్టుకు హాజరయ్యారు. రేపటి నుంచి జగన్ పాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది.

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద నిన్న సాయంత్రం జగన్ పాదయాత్ర ముగిసింది. అక్కడ నుంచి కోర్టు విచారణ కోసం రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయల్దేరారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నగరంలోని లోటస్ పాండ్ లోని నివాసానికి ఆయన చేరుకున్నారు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత... 10.30 నిమిషాలకు ఆయన కోర్టుకు చేరుకున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, మధ్యాహ్నం తర్వాత కూడా ఆయన కోర్టులోనే ఉండనున్నారు. విచారణ అనంతరం ఆయన మళ్లీ రోడ్డు మార్గంలో యర్రగుంట్ల ప్రాంతానికి చేరుకుంటారు.  

ys jagan
YSRCP
jagan court case
jagan padayatra
jagan cbi case
  • Loading...

More Telugu News