karthika pournami: కార్తీక పౌర్ణమి శోభ.. పుష్కరాలను తలపిస్తున్న నదీ తీరాలు!

  • కార్తీక పౌర్ణమి వేళ భక్తుల పుణ్యస్నానాలు
  • కిటకిటలాడుతున్న శ్రీశైలం, విజయవాడ
  • పంచారామాల్లో ప్రత్యేక పూజలు

కోరిన కోరికలు తీర్చే పరమ శివునికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నేడు కావడంతో తెల్లవారుఝామునుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున నదీ తీరాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గత సంవత్సరం కృష్ణా పుష్కరాలు, అంతకుముందు సంవత్సరం గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఘాట్లన్నీ, ఇప్పుడు భక్తులతో కిక్కిరిసిపోయి, మరోసారి పుష్కర శోభను తలపిస్తున్నాయి.

గోదావరి నది ఒడ్డున ఉన్న బాసర, వేములవాడ, ధర్మపురి, భద్రాచలం, రాజమహేంద్రవరంలోని గోష్పాద క్షేత్రం, కృష్ణానది ఒడ్డున ఉన్న అలంపురం, శ్రీశైలం, నాగార్జున సాగర్, అమరావతి, విజయవాడ ఘాట్ల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంది. ప్రధానంగా శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద, విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన భవానీ ఘాట్ వద్ద వేల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ప్రకాశం, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంతాలకు భక్తులు పోటెత్తారు . పుణ్యస్నానాలు చేసిన భక్తులు సమీపంలోని శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. ఏపీలోని పంచారామాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News