సదాశివుడి ఆరాధన ఫలితం

'ఓం నమఃశివాయ' అనే పంచాక్షరీ మంత్రం మహా శక్తిమంతమైనది. 'న' అనే అక్షరం భూమిని .. 'మ' అనే అక్షరం జలాన్ని .. 'శి' అనే అక్షరం అగ్నిని .. 'వా' అనే అక్షరం వాయువును .. 'య' అనే అక్షరం ఆకాశాన్ని సూచిస్తాయి. 'ఓం'కారంతో కూడిన శివతత్త్వమే ఈ సృష్టికి మూలం. అలాంటి పరమశివుడిని పూజించడం విశేషమైన ఫలితాలను అందిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

సదాశివుడిని బిల్వపత్రాలతో పూజించడం వలన భోగభాగ్యాలు లభిస్తాయి. కలువపూలతో ఆరాధిస్తే విజయం చేకూరుతుంది. శంఖు పుష్పాలతో పూజిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. అలాగే సువర్ణ జలంతో అభిషేకించడం వలన దారిద్ర్యం నశిస్తుంది. కస్తూరి జలంతో అభిషేకించడం వలన శత్రుహాని నివారించబడుతుంది. స్వచ్ఛమైన జలంతో శివుడిని అభిషేకించడం వలన సమస్త పాపాలు నశించి, సకలశుభాలు చేకూరతాయి. అందువలన సదాశివుడికి ప్రీతిని కలిగించేలా పూజిస్తూ తరించాలి.        


More Bhakti News