Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

- ఈ నెల 17 నుంచి అలీగఢ్లో పర్యటిస్తున్న మోహన్ భగవత్
- ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులతో వరుస సమావేశాలు
- విలువలే హిందూ సమాజానికి పునాది అన్న ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజంలో కులభేదాలు అంతం చేయాలని పిలుపునిచ్చారు. హిందువులకు ‘ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక’ అనే సూత్రాన్ని స్వీకరించడం ద్వారా సామాజిక సామరస్యం కోసం కృషి చేయాలని కోరారు.
ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 17 నుంచి ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో పర్యటిస్తున్న భగవత్ హెచ్బీ ఇంటర్ కాలేజ్, పంచన్ నగ్రీ పార్క్లోని రెండు శాఖల్లోని స్వయం సేవకులతో వేర్వేరుగా మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి చేరువ కావాలని, అట్టడుగు స్థాయిలో సామరస్యం, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించాలని కోరారు. విలువలే హిందూ సమాజానికి పునాది అని పేర్కొన్నారు. సంప్రదాయం, సాంస్కృతిక విలువలు, నైతిక సూత్రాలు కలిగిన సమాజాన్ని నిర్మించాలని సూచించారు.