KTR: ‘మూసి’ అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించండి: కేటీఆర్ ఆదేశాలు

  • మూసీ నది, నగరంలోని చెరువుల అభివృద్ధిపై సమీక్ష
  • అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేయాలి
  • శాటిలైట్ మ్యాపులతో ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేయాలి
  • మంత్రి కేటీఆర్ ఆదేశాలు

మూసి నది అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని సంబంధిత
అధికారులను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై ప్రధాన చర్చ జరిగింది. బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మూసి నది అభివృద్ది, సుందరీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని, మూసి నది మెత్తాన్ని సర్వే చేయాలని ఆదేశించారు. ఇందుకోసం, సుమారు 40 కిలోమీటర్లను డ్రోన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేయాలని, దీంతోపాటు గతంలో ఉన్న శాటిలైట్ మ్యాపులతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం పరిశీలిస్తున్న మూసి నది వెంబడి రోడ్ల గురించి ఈ సందర్భంగా సమీక్షించారు.

ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా నదికి ఇరువైపుల రోడ్లు, నదిపై నుంచి ఎలివేటేడ్ ఎక్స్ ప్రెస్ వే, రెండింటి కలయికతో కూడిన ప్రణాళికలను రూపొందించామని, వీటి నిమిత్తం అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. దీంతో పాటు, ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుబంధంగా రూపకల్పన చేస్తున్న బ్రిడ్జిల డిజైన్లు, నిర్మాణం సైతం చారిత్రక, సంస్కృతికి అద్దంపట్టేలా ఉండాలని కోరారు. నగర పరిధిలోని చెరువుల అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులను దీర్ఘకాలిక ప్రణాళిలను రూపొందించుకుని దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షాకాలం నాటికి కనీసం 50 చెరువులను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

వీటితో పాటు దుర్గం చెరువు సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, వర్షంకాలం నాటికి ఆయా చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించడంతోపాటు, చెరువు కట్ట అభివృద్ధి  పనులు ప్రారంభించాలని, అభివృద్ధి చేసే లోపల కబ్జాకు గురి కాకుండా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. కాగా, ఇప్పటికే 20 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు.

  • Loading...

More Telugu News