ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీ: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుక గా ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీని నల్లగొండలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రకటించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  మంత్రి వెంట పశుసంవర్ధక శాఖా కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ లు పాల్గొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు మంత్రి గొల్ల, కురుమల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

గొర్రెల పెంపకమే జీవనాధారంగా సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి ని సాధించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఆలోచనల నుండి వచ్చిందే గొర్రెల పంపిణీ కార్యక్రమం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8,109 గొర్రెల పెంపకం దారుల సొసైటీ లు ఉండగా, వీటిలో 7,61,895 మంది సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరందరికీ 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. రెండు విడతలలో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు 2017 వ సంవత్సరంలో ప్రారంభించి మొదటి విడతలో 3,66,373 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు.

ఇందుకోసం 4,579 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెల తో 2017-18 లో 20.75 లక్షలు, 2018-19 లో 39.94 లక్షలు, 2019-20 లో 39.28 లక్షలు, 2020-21 లో 37.12 లక్షల గొర్రెల సంపదను సృష్టించడం జరిగిందని వివరించారు. నూతనంగా పుట్టిన ఒక కోటి 37 లక్షల గొర్రె పిల్లల విలువ  6,169 కోట్ల రూపాయలు అని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో DD లు చెల్లించిన 28,335 మందికి ఈ నెల 16 వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో గొర్రెల పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 360 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన 4,210 కోట్ల రూపాయలను వచ్చే బడ్జెట్ లో కేటాయించనున్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని గొల్ల, కుర్మల ఆఖరి కుటుంబం వరకు గొర్రెలను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడానికే పరిమితం కాకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం పంపిణీ చేసే గొర్రెలకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పిస్తూ చనిపోయిన గొర్రెకు బదులు మరో గొర్రెను కొనుగోలు చేసి అందిస్తుందని చెప్పారు. అంతేకాకుండా గొర్రెలకు అవసరమైన మందులు, దాణా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజులలో రాష్ట్రం నుండి ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు మాంసం ఎగుమతులు చేసే స్థాయికి అభివృద్దిని సాధిస్తామన్న ధీమాను మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని చెప్పారు.

నిన్నమొన్న కొన్ని ఏరియాలో కోళ్లు చనిపోయాయి అని వార్తలు వచ్చాయి కానీ పక్క రాష్ట్రాల నుండి వచ్చినవి వాతావరణం సహకరించక చనిపోయాయని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమల ప్రతినిధులు, నిర్వాహకులతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అవసరమైన ఆదేశాలు, సూచనలు ఇస్తున్నారని చెప్పారు.

More Press Releases