Chandrababu: బాధిత మహిళకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్‌ వద్ద నినాదాలు చేయడం నేరమా?: చంద్ర‌బాబు

chandrababu slams ycp

  • టీడీపీ మహిళా నేతలపై కేసులు పెట్టార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం 
  • ఈ తీరు ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని విమ‌ర్శ‌
  • మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య‌

టీడీపీ మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఒంగోలులో 17 మంది టీడీపీ మ‌హిళా నేత‌ల‌పై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రేపల్లె అత్యాచార బాధిత మహిళకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్‌ వద్ద నినాదాలు చేయడం నేరమా? అని చంద్ర‌బాబు నిల‌దీశారు. 

మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌శ్నిస్తోన్న‌ గొంతులను ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒంగోలులో మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అలాగే, అదుపులోకి తీసుకున్న టీడీపీ మ‌హిళా నేత‌ల‌ను విడుదల చేయాలని ఆయ‌న అన్నారు. 

కాగా, ఇటీవల రేపల్లె రైల్వేస్టేషన్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన వివాహితపై కొంద‌రు దుండ‌గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఒంగోలు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధిత మ‌హిళ‌ను పరామర్శించ‌డానికి ఏపీ హోం మంత్రి వనిత వెళ్తుండగా ఆమె కాన్వాయ్‌ వద్ద టీడీపీ మ‌హిళా నేతలు నినాదాలు చేయ‌డంతో వారిపై పోలీసులు కేసులు పెట్టారు.

  • Loading...

More Telugu News